(1 / 6)
సారలమ్మ గద్దెలకు చేరుకోకముందే బుధవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షమంది వరకు అమ్మవార్లకు మొక్కులు సమర్పించగా.. తల్లి గద్దెలకు చేరుకోవడంతో జనం తాకిడి ఎక్కువైంది. క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుండగా.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
(2 / 6)
మేడారంలో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేయడం ఆనవాయితీ. ఆ తరువాత అమ్మవార్ల మొక్కులకు బయలు దేరుతుంటారు. కాగా అమ్మవార్ల దర్శనం కోసం రెండ్రోజుల ముందే మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్నవాగుకు బారులు తీరారు. దీంతో జంపన్నవాగు ఆవరణ మొత్తం కిటకిటలాడుతోంది.
(3 / 6)
జంపన్న వాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి 10 కిలో మీటర్ల వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. మేడారం, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, కాల్వపల్లి తదితర ప్రాంతాలు జంపన్నవాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. స్నానాల అనంతరం గద్దెల వద్ద అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలతో పాటు భక్తులు రోడ్ల మీదనే నిలిచిపోవాల్సి వచ్చింది.
(4 / 6)
ఓ వైపు ఎండ మరో వైపు రద్దీతో భక్తులు ఇబ్బందులు తలెత్తాయి. దీంతోనే పోలీస్ అధికారులు చేతులెత్తేశారనే విమర్శలు వినిపించాయి. జాతర మొత్తం సజావుగా సాగేందుకు దాదాపు 14 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ముందుగా అధికారులు ప్రకటించినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
(5 / 6)
జంపన్నవాగులో స్నానాల అనంతరం భక్తులు సమ్మక్క–సారలమ్మకు మొక్కులు సమర్పించుకోవడానికి క్యూ కడుతున్నారు. సాధారణ ధర్మదర్శనంతో పాటు వీఐపీ, వీవీఐపీ పాసులు కలిగిన భక్తులు దర్శనం కోసం పోటెత్తారు. దీంతో మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. ఇప్పటికే క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరగా.. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
(6 / 6)
ఇతర గ్యాలరీలు