Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం.. ప్రక్రియ ఇలా..
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు.. ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నిక ప్రక్రియ వివరాలు..
Vice President Election 2022: దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సిద్ధపడ్డాయి. పార్లమెంట్ హౌజ్లో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు సాగనున్న ఎన్నికలో.. ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి జగ్దీప్ ధనఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరేట్ అల్వాలు ఎన్నిక బరిలో ఉన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఇలా.
ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కొలేజ్ ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టోరల్ కొలేజ్లో లోక్సభ, రాష్ట్రసభ సభ్యులు ఉంటారు. ప్రొపోర్షనల్ రిప్రెజెంటేషన్ సిస్టమ్, సింగిల్ ట్రాన్స్ఫరెబుల్ ఓట్ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే.. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు.. వారు ఎవరికి మద్దతిస్తున్నారో.. వరుస సంఖ్యలో ఓటు వేయాలి. ఎన్నిక కోసం సీక్రెట్ బ్యాలెట్ను ఉపయోగిస్తారు.
రాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయలేరు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో వారు ఓట్లు వేయవచ్చు. వారి ఓట్లు చెల్లుతాయి.
ఎలక్టోరల్ కొలేజ్ సభ్యులు..
- రాజ్యసభ- 233, నామినేటెడ్- 12
- లోక్సభ- 543, నామినేటెడ్- 2
- మొత్తం- 790
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి పేరు 20మందిని ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 20మంది.. ఆ పేరుకు మద్దతు పలకాలు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాలని అనుకుంటే.. రూ .15వేల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఉపరాష్ట్రపతి ఎవరు అవ్వొచ్చు?
భారత పౌరసత్వం ఉండి, 35ఏళ్ల దాటిన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు. భారత ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారైతే.. ఎన్నికలో పోటీ చేయలేరు.
ధన్ఖడ్ గెలుపు లాంఛనమే..!
Jagdeep Dhankhar : ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి జగ్దీప్ ధన్ఖడ్ గెలుపు లాఛనమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంకెల బలం కూడా ధన్ఖడ్వైపే ఉంది.
రాజ్యసభలో 8 సీట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 36మంది టీఎంసీ ఎంపీలు దూరంగా ఉండనున్నారు. ఫలితంగా ఈసారి 744 ఎంపీలు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ 744మందిలో 441 ఎంపీలు ఎన్డీఏకు చెందినవారే. వీరిలో ఒక్క బీజేపీ నుంచే 394మంది ఉన్నారు. వీరితో పాటు ఐదుగురు నామినేటెడ్ సభ్యులు ఎన్డీఏవైపే నిలబడ్డారు. వీరే కాకుండా.. వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీడీపీ వంటి పార్టీల నుంచి ధన్ఖడ్కు మద్దతు ఉంది. క్రాస్ ఓటింగ్ జరిగితే.. ధన్ఖడ్కు మరిన్ని ఓట్లు పెరుగుతాయి.
ఇక మార్గరేట్ అల్వాకు 200 వరకు ఓట్లు లభించే అవకాశం ఉంది. కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు ఆమె వెనకున్నాయి.
సాయంత్రం ఓటింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. రాత్రి నాటికి.. ఫలితాలు వెలువడతాయి.
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల10తో ముగియనుంది. 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సంబంధిత కథనం