Cyclone Sitrang live updates : దూసుకొస్తున్న 'సిత్రంగ్​'.. ఈ రాష్ట్రాలకు అలర్ట్-these states are on alert as imd issues warning for cyclone sitrang ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  These States Are On Alert As Imd Issues Warning For Cyclone Sitrang

Cyclone Sitrang live updates : దూసుకొస్తున్న 'సిత్రంగ్​'.. ఈ రాష్ట్రాలకు అలర్ట్

Sharath Chitturi HT Telugu
Oct 22, 2022 07:59 AM IST

Cyclone Sitrang live updates : సిత్రంగ్​ తుపాను నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​ జారీ చేసింది. కాగా.. ఈ నెల 25న సిత్రంగ్​ తుపాను పశ్చిమ్​ బెంగాల్​- బంగ్లాదేశ్​లో తీరం దాటుతుందని తెలుస్తోంది.

దూసుకొస్తున్న సిత్రంగ్​ తుపాను!
దూసుకొస్తున్న సిత్రంగ్​ తుపాను!

Cyclone Sitrang live updates : అండమాన్​ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపానుగా మారి ఈ నెల 25న పశ్చిమ్​ బెంగాల్​- బంగ్లాదేశ్​ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ(భారత వాతావరణశాఖ) వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 110కి.మీల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. సిత్రంగ్​ తుపాను నేపథ్యంలో పలు రాష్ట్రాలకు అలర్ట్​ జారీ చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

"ఉత్తర అండమాన్​ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్యం- ఉత్తరంవైపు ప్రయాణించే అవకాశం ఉంది. 23న తీవ్ర వాయుగుండంగా మారుతుంది. 24న తుపానుగా మారుతుంది. పశ్చిమ- మధ్య, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. అక్కడి నుంచి ఉత్తరం-ఈశాన్యవైపు ప్రయాణిస్తుంది. ఫలితంగా ఒడిశాలో తీరం దాటదు. పశ్చిమ్​ బెంగల్​-బంగ్లాదేశ్​ మధ్య ఈ నెల 25న తీరం దాటుతుంది," అని ఐఎండీ వెల్లడించింది.

Cyclone Sitrang : ఐఎండీ రిపోర్టు ప్రకారం.. ఈ నెల 23 నుంచి 25 వరకు ఒడిశాలో విస్త్రతంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ్​ బెంగాల్​లోని గ్యాంగటిక్​ ప్రాంతంలో 24-26 వరకు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయి. దక్షిణ 24 పరగణాస్​, ఉత్తర్​ 24 పరగణాస్​, పూర్బ మేదినీపూర్​ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంటుంది.

"ఈ నెల 24న.. దక్షిణ 24 పరగణాస్, ఉత్తర 24 పరగణాస్​, పూర్బ మేదినీపూర్​​లో గాలులు గంటకు 45-55కి.మీల వేగంతో వీస్తాయి. 66కి.మీల వేగం వరకు వెళ్లొచ్చు. 25వ తేదీన ఆయా ప్రాంతాల్లో గంటకు 110 కి.మీల వేగంతో గాలులు వీస్తాయి. అదే సమయంలో కోల్​కతా, హోరాలో గంటకు 30-50కి.మీల వేగంతో గాలులు వీస్తాయి," అని ఐఎండీ పేర్కొంది.

ప్రస్తుతానికైతే సిత్రంగ్​ తుపాను ప్రభావం భారీగా ఉండకపోవచ్చని ఐఎండీ వెల్లడించింది. రానున్న రోజుల్లో సిత్రంగ్ తుపాను​ ప్రభావంపై అప్డేట్​ చేస్తామని స్పష్టం చేసింది.

ప్రభుత్వాలు అప్రమత్తం..

Cyclone Sitrang landfall : సిత్రంగ్​ తుపాను నేపథ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సెంట్రల్​ కేబినెట్​ సెక్రటరీ రాజివ్​ గౌబా.. తుపాను సన్నాహాలపై సమీక్ష నిర్వహించారు. సిత్రంగ్​ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిత్రంగ్​ తుపాను తీరం దాటే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

సిత్రంగ్​ తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​, అండమాన్​ అండ్​ నికోబార్​, ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. మత్సకారులను అప్రమత్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సన్నద్ధమవుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం