Rajasthan Crime news: తనపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన దళిత యువతిని గాయాలు చూపించేందుకు బట్టలు విప్పాలని రాజస్తాన్ లోని కరౌలి జిల్లాలో ఉన్న హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్ కోరాడు. అందుకు నిరాకరించిన ఆ యువతి.. ఆ న్యాయమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేజిస్ట్రేట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన గాయాలను చూడటానికి హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్ తనను బట్టలు విప్పమని కోరారని ఆరోపిస్తూ బాధితురాలు మార్చి 30 న ఫిర్యాదు చేసిందని డిప్యూటీ ఎస్పీ (ఎస్టీ-ఎస్సీ) సెల్ మీనా మీనా తెలిపారు. ఆమె బట్టలు విప్పడానికి నిరాకరించిందని, మార్చి 30న కోర్టులో వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ పై ఫిర్యాదు చేసిందని తెలిపారు. గౌరవానికి భంగం కలిగించారనే అభియోగాల కింద కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఆ మేజిస్ట్రేట్ పై ఐపీసీ సెక్షన్ 345(అక్రమ నిర్బంధం), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును రాజస్తాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వం లోని బృందానికి కేసును బదిలీ చేశారు.
మార్చి 19న ఆ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై మార్చి 27న హిందౌన్ సదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు.