President election process | రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఎలా జ‌రుగుతుంది?-presidential polls to be held on july 18 counting of votes on july 21 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  President Election Process | రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఎలా జ‌రుగుతుంది?

President election process | రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఎలా జ‌రుగుతుంది?

HT Telugu Desk HT Telugu
Jun 09, 2022 05:28 PM IST

16వ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల న‌గారా మోగింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీకాలం జులై 24తో ముగుస్తుంది. నూత‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జులై 18న జ‌ర‌గ‌నుంది. జులై 21 ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం, జులై 25న కొత్త రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ఈ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ప్ర‌క్రియ ఎలా ఉండోబోతోంది?

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను వివర‌స్తున్న సీసీఈ రాజీవ్ కుమార్‌
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను వివర‌స్తున్న సీసీఈ రాజీవ్ కుమార్‌ (PTI)

భార‌త్‌లో రాష్ట్ర‌ప‌తి రాజ్యాంగాధినేత‌. త్ర‌విధ ద‌ళాల‌కు అధిప‌తి. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి మేర‌కే చ‌ట్టాలు అమ‌ల్లోకి వ‌స్తాయి. అయితే, భార‌త ప్ర‌జాస్వామ్యంలో రాష్ట్ర‌ప‌తిది నామ‌మాత్ర అధికార‌మే. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా ఎన్నుకున్న ప్ర‌భుత్వానిదే నిజ‌మైన అధికారం. ప్ర‌తీ ఐదు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 62 ప్ర‌కారం, ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వీకాలం ముగియ‌క‌ముందే, నూత‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గాలి.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌..

రాష్ట్ర‌ప‌తిని ర‌హ‌స్య బాలెట్ ప‌ద్ధ‌తి ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునే అర్హ‌త ఉన్న స‌భ్యుల‌ను ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌లో లోక్‌స‌భ‌, రాజ్య స‌భ‌ల స‌భ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి స‌హా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు స‌భ్య‌లుగా ఉంటారు. అయితే, పార్ల‌మెంట్లో కానీ, అసెంబ్లీల్లో కానీ నామినేటెడ్ స‌భ్యులు ఈ ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌లో స‌భ్యులుగా ఉండ‌రు. వారికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసే హ‌క్కు ఉండ‌దు. అలాగే, రాష్ట్రాల్లోని శాస‌న మండ‌లి స‌భ్యులు(ఎమ్మెల్సీ) కూడా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేరు.

ఎంపీలు, ఎమ్మెల్యేల విలువ‌

ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేసే అర్హ‌త ఉన్న ఎంపీల సంఖ్య 776. ఎమ్మెల్యేల సంఖ్య 4.033. అంటే, ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌లోని మొత్తం స‌భ్యుల సంఖ్య 4,809. అయితే, స‌భ్యుల సంఖ్య ఆధారంగా ఈ ఎన్నిక జ‌ర‌గ‌దు. ఎల‌క్టోర‌ల్ కాలేజ్ మొత్తానికి ఒక విలువ ఉంటుంది. అందులో ఒక్కో ఎంపీకి ఒక విలువ‌, ఒక్కో ఎమ్మెల్యేకు ఒక విలువ ఉంటుంది. ఈ ఓట్ల విలువ‌ను రాజ్యాంగంలోని 55(2) అధిక‌ర‌ణంలో పేర్కొన్న ప్ర‌కారం నిర్ధారిస్తారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఎల‌క్టోర‌ల్ కాలేజ్ విలువ 10,86,431. ఇందులో ఎంపీల విలువ 5,43,200. అలాగే, ఎమ్మెల్యేల విలువ 5.43,231. ఒక్కో ఎంపీ విలువ 700. మొత్తం ఎల‌క్టోర‌ల్ కాలేజ్ విలువ‌లో స‌గానికి పైగా సాధించిన వారు గెలిచిన‌ట్లుగా ప్ర‌క‌టిస్తారు.

పార్ల‌మెంట్‌, అసెంబ్లీల్లో..

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి పార్ల‌మెంట్‌లో, అసెంబ్లీల్లో పోలింగ్ జ‌రుగుతుంది. సాధార‌ణంగా ఎంపీలు పార్ల‌మెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా అసెంబ్లీల్లో ఓటు వేస్తారు. కానీ, అసాధార‌ణ ప‌రిస్థితుల్లో, ముందుగా ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి తీసుకుని ఎంపీలు త‌మ రాష్ట్రానికిచెందిన అసెంబ్లీలో, ఎమ్మెల్యేలు పార్ల‌మెంట్లో ఓటు వేయ‌వ‌చ్చు. అలాగే, పోలీసుల ముంద‌స్తు నిర్బంధంలో ఉన్న‌వారు కూడా ఓటు వేయ‌వ‌చ్చు. జైళ్లో ఉన్న‌వారు పెరోల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పెరోల్ ల‌భిస్తే, వారు వ‌చ్చి ఓటు వేయ‌వ‌చ్చు. ఈ ఎన్నిక‌ల‌కు రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తారు.

యూపీలో అత్య‌ధికం.. సిక్కింలో అత్య‌ల్పం

ఎల‌క్టోర‌ల్ కాలేజీలో ఎమ్మెల్యేల విలువ రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. 1971 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఈ విలువ‌ను గ‌ణిస్తారు. దీని ప్ర‌కారం ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎమ్మెల్యే విలువ అత్య‌ధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 403 కాగా, ఒక్కో ఎమ్మెల్యే విలువ 208. అంటే మొత్తం ఆ రాష్ట్రం ఎమ్మెల్యేల ఎల‌క్టోర‌ల్ కాలేజ్ విలువ అత్య‌ధికంగా 83,824. అలాగే, అత్ప‌ల్ప ఎమ్మెల్యే విలువ క‌లిగిన‌ది సిక్కిం రాష్ట్రం. ఇక్క‌డ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 32. ఒక్కో ఎమ్మెల్యే విలువ 7. అంటే, సిక్కిం రాష్ట్ర ఎమ్మెల్యేల ఎల‌క్టోర‌ల్ కాలేజ్ విలువ 224 మాత్ర‌మే.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌రువాత జ‌రుగుతున్న రెండో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లివి. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ ఎమ్మెల్యేల విలువ 15708 గా ఉంది. ఇక్క‌డ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలుండ‌గా, ఒక్కో ఎమ్మెల్యే విలువ 132గా నిర్ధారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 175. ఇక్క‌డ ఒక్కో ఎమ్మెల్యే విలువ 159. అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎమ్మెల్యేల ఎల‌క్టోర‌ల్ కాలేజ్ విలువ 27,825గా ఉంటుంది.

గ‌త ఎన్నిక‌లు..

2017లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల 2017 జులై 17న జ‌రిగాయి. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌రిచిన లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ మీరాకుమార్‌పై ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ 3,34,730 విలువైన ఓట్ల తేడాతో గెలుపొందారు.

IPL_Entry_Point