2nd batch cheetahs arriving: గత సంవత్సరం సెప్టెంబర్ లో నమీబియా నుంచి ఒక బ్యాచ్ చిరుత పులులు (cheetahs) భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు 5 ఆడ, 3 మగ చిరుత పులులను భారత్ తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న వాటిని మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో (Kuno National Park KNP) వదిలి పెట్టారు. ప్రస్తుతం అవి కునో నేషనల్ పార్క్ లోని హంటింగ్ ఎన్ క్లోజర్లలో ఉన్నాయి.
రెండో బ్యాచ్ చిరుతలు ఫిబ్రవరి 18న భారత్ కు రానున్నాయి. ఈ సారి మొత్తం 12 చిరుతలు (cheetahs) దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తీసుకు వస్తున్నారు. వీటిలో ఎన్ని మగ చిరుతలు? ఎన్ని ఆడ చిరుతలు (cheetahs) అనే విషయం తెలియలేదు. వాటిని కూడా మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లోనే (Kuno National Park KNP) వదిలివేయనున్నారు. అంతకుముందు, వాటిని కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక ఎన్ క్లోజర్లలో ఉంచుతారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో గ్వాలియర్ కు అక్కడి నుంచి కునో నేషనల్ పార్క్ కు వాటిని తీసుకువస్తారు. వాటి కోసం ఇప్పటికే కునో నేషనల్ పార్క్ లో ప్రత్యేక ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు.
భారత్ లో చిరుత పులులను (cheetahs) అంతరించిపోయిన జాతిగా 1952లో నిర్ధారించారు. భారత్ లో చివరి చిరుత ప్రస్తుత చత్తీస్ గఢ్ లోని కోర్యా జిల్లాలో 1947లో మరణించింది. ఇటీవల భారత్ లో మళ్లీ ఆ చిరుత జాతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ఒప్పందాల ద్వారా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి వాటిని భారత ప్రభుత్వం తీసుకువస్తోంది.