Madhya Pradesh accident today : వంతెనపై నుంచి పడిన బస్సు.. 22మంది దుర్మరణం!
Madhya Pradesh road accident : మధ్యప్రదేశ్లో ఓ బస్సు వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో 22మంది మరణించారు.
Madhya Pradesh bus accident : మధ్యప్రదేశ్లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. 50 ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు.. ఖర్గోన్ ప్రాంతంలోని ఓ వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో 22మంది ప్రాణాలు కోల్పోయారు. 20మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
అసలు ప్రమాదం ఎలా జరిగింది..?
ప్రమాదానికి గురైన బస్సు.. ఇండోర్కు వెళుతుండగా ఖర్గోన్లోని దసంగ గ్రామంలో బ్రిడ్జ్పై నుంచి కిందకు పడింది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టారు. సహాయక చర్యల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
Madhya Pradesh accident today : అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ తప్పిదం ఉందా? అతివేగమే ప్రమాదానికి కారణమా? వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. కాగా.. ఘటనపై దర్యాప్తు చేపట్టి, కారణాన్ని కనుగొంటామని అధికారులు స్పష్టం చేశారు.
సీఎం దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన..
బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారికి రూ. 4లక్షల పరిహారాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ. 25వేలు ఇస్తామని హామీనిచ్చారు. క్షతగాత్రుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
Khargone bus accident death toll : మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారాన్ని ఇస్తున్నట్టు ప్రకటించింది.
"పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2లక్షల పరిహారాన్ని మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇస్తాము. గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తాము," అని పీఎంఓ ట్వీట్ చేసింది.
సంబంధిత కథనం