Rahul Gandhi: రాహుల్ గాంధీ షూ లేస్ను కేంద్ర మాజీ మంత్రి కట్టారు: బీజేపీ ఆరోపణ.. కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ రిప్లై!
Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో నడుస్తున్న రాహుల్ గాంధీ షూ లేస్ను కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ కట్టారంటూ బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఆరోపించారు. ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే ఇది నిజం కాదని జితేంద్ర అన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షూ లేస్ను ఓ కేంద్ర మాజీ మంత్రి కట్టారని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా (Amit Malviya) ఆరోపించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో నడుస్తున్న సమయంలో రాహుల్ గాంధీ షూ లేస్ ఊడిపోగా.. మాజీ మంత్రి అయిన జితేంద్ర సింగ్ అహిర్వార్ (Jitendra Singh Ahirwar) దాన్ని కట్టారని విమర్శించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఇందుకు జితేంద్ర సింగ్ స్పందించారు. అందులో నిజయం లేదని, అమిత్ మాల్వియాపై న్యాయపరమైన చర్యలకు దిగుతామని బదులిచ్చారు.
ఏం జరిగిందంటే..
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నడుస్తున్న ఓ వీడియోను బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జితేంద్ర సింగ్ ఆగి, వెనక్కి తిరిగి రాహుల్ వైపుగా కిందికి వంగి మొకాళ్లపై కూర్చున్నట్టు ఆ వీడియోలో ఉంది. దీనిపైనే మాల్వియా ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీ షూ లేస్ కట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్ మోకాళ్ల మీద కూర్చుకున్నారు” అని పేర్కొన్నారు. తనకు సాయం చేసిన జితేంద్ర వీపుపై రాహుల్ గాంధీ చరిచారని, ఆయన అహంకారపూరితంగా వ్యవహరించారనేలా రాసుకొచ్చారు.
అంతా అబద్ధం
బీజేపీ నేత అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన వీడియోకు కాంగ్రెస్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. “అధికార బీజేపీ జాతీయ సమాచార విభాగం చీఫ్గా ఉన్న మీరు చేసిన ఈ ట్వీట్ పూర్తిగా అబద్ధం. పరువుకు భంగం కలిగించేదిగా ఉంది. నా సొంత షూ లేస్ను నేను కట్టుకున్నా. నా అభ్యర్థన మేరకే రాహుల్ గాంధీ ఆగారు. ఈ ట్వీట్ను డిలీట్ చేసి, రాహుల్ గాంధీని క్షమాపణ అడగండి. లేకపోతే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని జితేంద్ర సింగ్ రిప్లై ఇచ్చారు.
రాహుల్ షూకు లేస్ లేవు
అమిత్ మాల్వియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ షూ ఫొటో ట్వీట్ చేశారు. అది లేస్లెస్ అని పేర్కొన్నారు. మరోసారి అబద్ధం చెప్పి దొరికిపోయారని బీజేపీని విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత జోడో యాత్ర రాజస్థాన్లో పూర్తయ్యాక ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోకి ప్రవేశించింది. రాష్ట్ర సరిహద్దు వద్ద హర్యానా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. భూపేంద్ర సింగ్ హూడా, రణ్దీప్ సుర్జేవాలా, కుమారి సెల్జా, దీపేంద్ర సింగ్ హూడా.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.