Draupadi Murmu : భారత 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే-all you need to know about draupadi murmu 15th president of india know in full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  All You Need To Know About Draupadi Murmu 15th President Of India Know In Full Details

Draupadi Murmu : భారత 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 09:20 PM IST

NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయం సాధించారు. రామ్ నాథ్ కోవింద్ తర్వాత, ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

ద్రౌపదీ ముర్ము
ద్రౌపదీ ముర్ము (HT_PRINT)

ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము 1958 లో మయుర్‌భంజ్‌ జిల్లాలో ఉపార్ బెడ గ్రామంలో జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారు. ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందారు. 2009లో అనుమానాస్పదస్థితిలో ఒక కుమారుడు మ‌ర‌ణించాడు. ఈ బాధ నుంచి తెరుకునే లోపే.. 2012లో రోడ్డు ప్రమాదంలో మ‌రో కుమారుడు చనిపోయాడు. భ‌ర్త శ్యామ్ చ‌ర‌ణ్ ముర్ము గుండెపోటుతో మ‌ర‌ణించారు. ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. సంతాల్ తెగకు చెందిన ముర్ము.. భారత రెండో మహిళా రాష్ట్రపతి. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచి పోతారు. అంతకుముందు.. భారత ప్రథమ మహిళగా ప్రతిభా సింగ్‌ పాటిల్‌ ఎంపికయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

ముర్ము భువనేశ్వర్‌లోని రమా దేవి మహిళా కళాశాల నుండి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ పట్టా సాధించారు. ద్రౌపది అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా శ్రీ ఆరబిందో ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో వర్క్ చేశారు. 1979 నుంచి 1983 వరకు ఒడిశా ప్రభుత్వంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా సైతం పని చేశారు.

1997లో కౌన్సిలర్‌గా ముర్ము రాజకీయ జీవితం ప్రారంభమైంది. అనంతరం రాయరంగ్‌పూర్‌ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎన్‌ఏసీ) వైస్-ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరంలో ఒడిశా అసెంబ్లీకి రాయరంగ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటి చేసి గెలిచారు. ఆ తర్వాత 2004లో మరోసారి రాయరంగ్‌పూర్‌ నుండి గెలిచారు. బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని నవీన్ పట్నాయక్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలకు పని చేశారు. 2007లో ఒడిశా ఎమ్మెల్యేలకు ఇచ్చే నిల్‌కంఠ అవార్డు ద్రౌపదీ ముర్ము పోందారు.

2006 నుంచి 2009 వరకు ఒడిశా బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలుగా ఉన్నారు. 2013 లో ఆమె ఒడిశాలోని బీజేపీ పార్టీ షెడ్యూల్డ్ తెగ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా చేశారు. 2015 నుంచి జార్ఖండ్‌ గవర్నర్‌గా చేశారు. ఇప్పుడు భారత 15వ రాష్ట్రపతిగా ఎంపికయ్యారు ద్రౌపదీ ముర్ము.

దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన గిరిజన సమాజానికి చెందిన మొదటి మహిళ ద్రౌపదీ ముర్ము. ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 'ఆమె తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. గొప్ప రాష్ట్రపతి అవుతారు. ముర్ముకు గొప్ప పరిపాలనా అనుభవం ఉంది.' అని ప్రధాని అన్నారు.

WhatsApp channel