Lok sabha elections: వాట్సాప్ లో ‘వికసిత్ భారత్’ సందేశాలను నిలిపి వేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ ఆదేశాలు
Lok sabha elections: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ లో కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించే ‘వికసిత్ భారత్’ సందేశాలను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
Lok sabha elections: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దాంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తొలి ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ ‘వాట్సాప్’ లో చేస్తున్న ‘వికసిత్ భారత్’ ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
వికసిత భారత్..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో 2014 లో అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి, అంటే, గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ, వికసిత్ భారత్ క్యాంపెయిన్ ను వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల్లో కేంద్ర ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ క్యాంపెయిన్ ను నిలిపివేయాలని ఈసీఐ ఆదేశించింది.
వాట్సాప్ ద్వారా..
లోక్ సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం.. వాట్సాప్ ద్వారా వికసిత్ భారత్ సందేశాలను పంపించడాన్ని వెంటనే నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘం మార్చి 21 న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ విషయంపై వెంటనే ఎంఈఐటీవై నుంచి కాంప్లయన్స్ రిపోర్టు ఇవ్వాలని ఈసీ తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.