MLC Kavitha: కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. ED, CBIలకు భయపడేది లేదు
Delhi Liquor Scam Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉండటం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కవిత.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.
MLC Kavitha On Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టిస్తోంది. అయితే దిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు రావటంపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని కవిత ఆరోపించారు. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని కాబట్టే ఈడీ, ఐటీ, సీబీఐలు వస్తున్నాయని చెప్పారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటిచారు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణలో ఉన్నారని చెప్పారు. చిల్లర రాజకీయాలను మానివేయాలని ప్రధాని మోదీని కోరారు.
"దేశంలోకి బీజేపీ పాలన వచ్చి ఎనిమిది ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ ఎనిమిది ఏళ్లలో తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజం. ఎన్నికలకు ముందు ఈడీలతో సోదాలు చేయించడం కామన్. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం, బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతాం. ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదు. జైల్లో పెట్టడం కంటే, ఎక్కువ చేసేది ఏమి లేదు. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పంధాన్ని మార్చుకోవాలి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు" అని కవిత అన్నారు.
రిమాండ్ రిపోర్టులో కవిత పేరు….
Kavitha Name In Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తాజాగా కీలక విషయాలు బయటికి వచ్చాయి.అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు(Amith Arora Remand Report)లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొంది . మంగళవారం రాత్రి అమిత్ అరోరాను అరెస్టు చేసింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది.
సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అరోరా ధృవీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది ఈడీ. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
ఈ లిక్కర్ కుంభకోణంలో.. అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ నుంచి వినిపిస్తున్న సమచారం. గురుగావ్ కు చెందిన అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్టుగా సమాచారం. దినేష్ అరోరా(Dinesh Arora) అప్రూవర్గా మారగా... అమిత్ అరోరా ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. అమిత్ అరోరా 9వ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికి ఈ కేసులో ఈడీ ఆరుగురిని అరెస్టు చేసింది.
నిజానికి లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కవిత టార్గెట్ గా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై కవిత కూడా తీవ్రంగా స్పందించారు. కోర్టును కూడా ఆశ్రయించారు. తనపై విమర్శలు చేయకుండా.. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు విమర్శలు తగ్గించారు. ఇదిలా ఉండగా... తాజాగా రిమాడ్ రిపోర్టులో కవతి పేరు ఉండటం రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది.