Hyd Shocking Murder: హైదరాబాద్ నేరెడ్మెట్ పిఎస్ పరిధిలో పాన్ దుకాణం వద్ద జరిగిన చిన్నపాటి ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. పాన్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి దుకాణం యజమానిని పాన్ ఇవ్వాలంటూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి వారించాడు. గట్టిగా అరవొద్దు అనడంతో ఆగ్రమానికి గురైన నిందితుడు అతనిపై పిడిగుద్దులు కురిపించాడు.
బాధితుడు ముక్కు నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివాయకనగర్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి ఈ ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం యాదవ నగర్లో ఉండే బండారి రాము సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య అనిత, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.
రాము సోమవారం సాయంత్రం వినాయకనగర్ లోని వైన్ షాపు వద్దకు వచ్చి మద్యం తాగాడు. అనంతరం వైన్స్ బయట ఉన్న పాన్ దుకాణం వద్ద ఉన్నాడు. ఇంతలో అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అక్కడికి వచ్చి పాన్ కావాలంటూ గట్టిగా కేకలు వేశాడు. ఎందుకలా అరుస్తున్నానని రాము అతడిని ప్రశ్నించాడు.
దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ నువ్వెవ్వరు నాకు చెప్పడానికి అంటూ రాముపై దాడి చేశాడు. రాము ముఖంపై పలుమార్లు పిడిగుద్దులు వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య అనిత, పిల్లలు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు.