IPL 2022 | హార్దిక్ పాండ్యా బౌలింగ్పై వసీం జాఫర్ ట్వీట్ వైరల్.. ఇంతకీ అందులో ఏముంది?
IPL 2022 కొత్త టీమ్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్లోనే అతని టీమ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో అతడు బౌలింగ్ చేయడంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముంబై: కొన్నాళ్ల కిందటి వరకూ టీమిండియాకు హార్దిక్ పాండ్యా రూపంలో నిఖార్సయిన ఆల్రౌండర్ దొరికాడని అందరూ సంబరపడ్డారు. అయితే గాయం కారణంగా చాలా రోజులుగా అతడు బౌలింగ్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం బ్యాటింగ్ కోసమే అతన్ని టీమ్లోకి తీసుకునే పరిస్థితి లేదు. దీంతో అతని స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్లాంటి యువ ఆల్రౌండర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఐపీఎల్లో అడుగుపెట్టిన హార్దిక్.. తొలి మ్యాచ్లోనే ఆల్రౌండర్గా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్లో ముందు మొత్తం నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేశాడు హార్దిక్. గంటకు 130 కి.మీ. వేగంతోనూ బంతులు వేశాడు. అయితే వికెట్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. పైగా 37 పరుగులు ఇచ్చుకున్నాడు. ఏదేమైనా అతడు మళ్లీ బౌలింగ్ చేయడం మాత్రం అభిమానులను సంతోషానికి గురి చేసింది.
ఇది చూసి టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఓ ట్వీట్ చేశాడు. సహజంగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ.. మంచి టైమింగ్తో పంచ్లు వేయడం అతనికి అలవాటు. హార్దిక్ పాండ్యా విషయంలోనూ అలాంటిదే ఓ ట్వీట్ చేశాడు. హార్దిక్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ ఇలా అయిపోయారంటూ ఎప్పటిదో అజయ్ దేవ్గన్ మూవీలోని ఓ పాటను అతడు ట్వీట్ చేయడం విశేషం. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసి నిజమే కదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సంబంధిత కథనం