England vs India: నోర్మూసుకొని బ్యాటింగ్ చెయ్.. ఇంగ్లండ్ ప్లేయర్కు అంపైర్ వార్నింగ్.. వీడియో
England vs India: ఇంగ్లండ్, ఇండియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్లో ప్లేయర్స్ మధ్యే కాదు.. ప్లేయర్స్, అంపైర్ల మధ్య కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.
బర్మింగ్హామ్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య చివరి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అసలు పెద్దగా ఆశలు లేని స్థితి నుంచి చివరి రోజు మ్యాచ్లో విజయంపై సాధించే దిశగా ఇంగ్లండ్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో రెండు టీమ్స్ ప్లేయర్స్ మధ్య అప్పుడప్పుడూ కాస్త మాటల యుద్ధం కూడా నడుస్తోంది. విరాట్ కోహ్లి, బెయిర్స్టో.. సిరాజ్, బెయిర్స్టో.. విరాట్ కోహ్లి, క్రాలీలు ఇలా మాటామాటా అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఇంగ్లండ్ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్కు అంపైర్ కెటిల్బరో వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "అంపైరింగ్ మమ్మల్ని చేయనివ్వు. నువ్వు బ్యాటింగ్ చెయ్. సరేనా? లేదంటే నువ్వు కష్టాల్లో పడతావు" అని అంపైర్.. బ్రాడ్ను ఉద్దేశించి అన్నాడు. అయినా సరే బ్రాడ్ వినకపోవడంతో కెటిల్బరో సహనం కోల్పోయాడు.
"బ్రాడీ.. బ్రాడీ.. నోర్మూసుకొని బ్యాటింగ్ చెయ్" అని సీరియస్గా అనడం విశేషం. ఈ ఘటన మూడో రోజు ఆటలో చోటు చేసుకుంది. సామ్ బిల్లింగ్స్తో కలిసి బ్రాడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ ఇలా హెచ్చరించాడు. తొలి ఇన్నింగ్స్లో అతడు కేవలం ఒక పరుగుకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లోనే టెస్ట్ క్రికెట్లో 550 వికెట్లు తీసిన బ్రాడ్.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
మరోవైపు నాలుగో రోజు టీ తర్వాత వరకూ మ్యాచ్పై పట్టు బిగించినట్లు కనిపించిన టీమిండియా.. క్రమంగా ఈ మ్యాచ్ ఓడిపోయే పరిస్థితికి చేరింది. 378 రన్స్ భారీ టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో రూట్, బెయిర్స్టో హాఫ్సెంచరీలు చేసి ఇంకా క్రీజులో ఉండటంతో.. చివరి రోజు ఇంగ్లండ్ మరో 119 రన్స్ చేస్తే చాలు గెలిచేస్తుంది. అదే జరిగితే సిరీస్ 2-2తో సమమవుతుంది.