Rishabh Pant:రోహిత్శర్మపై షాంపేన్ వర్షం కురిపించిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
Rishabh Pant: ఇంగ్లండ్పై చివరి వన్డేలో అనూహ్య విజయం తర్వాత టీమిండియా సంబరాలు అంబరాన్ని అంటాయి. ముఖ్యంగా ట్రోఫీ అందుకునే సమయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రిషబ్ పంత్ కెప్టెన్ రోహిత్ శర్మపై షాంపేన్ వర్షం కురిపించాడు.
లండన్: ఇంగ్లండ్ గడ్డపై సరిగ్గా 20 ఏళ్ల కిందట నాట్వెస్ట్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది టీమిండియా. ఆ విజయం సాధించి 20 ఏళ్ల అయిన సందర్భాన్ని కూడా ఈ మధ్యే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను మరోసారి వాళ్ల గడ్డపైనే ఓడించి వన్డే సిరీస్ గెలవడం నిజంగా టీమిండియా సాధించిన అద్భుతమనే విజయమనే చెప్పాలి.
చివరి వన్డేలో అసలు ఆశలే లేని స్థితిలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా పోరాడి టీమ్ను గెలిపించిన తీరు అప్పటి నాట్వెస్ట్ ఫైనల్లో యువరాజ్, మహ్మద్ కైఫ్ ఫైట్ను గుర్తు చేసింది. ఆ ఫైనల్లో సీనియర్లంతా అప్పటికే పెవిలియన్ చేరినా, ముందు భారీ టార్గెట్ (326) భయపెడుతున్నా అప్పుడప్పుడే టీమ్లోకి వచ్చిన యువ ప్లేయర్స్ యువీ, కైఫ్ బెదరలేదు.
ఇప్పుడు కూడా పంత్, పాండ్యా అదే పోరాట పటిమను కనబరిచారు. ఈ క్రమంలో వైట్బాల్ క్రికెట్లో రిషబ్ పంత్ తన తొలి సెంచరీ సాధించాడు. అటు హార్దిక్ బౌలింగ్లో 4 వికెట్లతోపాటు హాఫ్ సెంచరీతో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. సీనియర్లు రోహిత్, కోహ్లి, ధావన్లాంటి వాళ్లు విఫలమైనా ఈ ఇద్దరూ ఊహించని విజయాన్ని సాధించిపెట్టారు.
దీంతో ట్రోఫీ అందుకునే సమయంలో పంత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతడు షాంపేన్ బాటిల్తో హంగామా చేశాడు. టీమ్ మెంబర్స్ అందరిపై షాంపేన్ వెదజల్లుతూ ఆనందించాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేసి మరీ పదేపదే షాంపేన్ చల్లాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ మూమెంట్ను మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు వీడియోలో కనిపించింది.
ట్రోఫీతో టీమ్ మొత్తం ఫొటోలకు పోజులిచ్చిన తర్వాత చివరికి విరాట్ కోహ్లి మరో షాంపేన్ బాటిల్ తీసుకొని అందరిపై వెదజల్లాడు. ఈసారి ఇంగ్లండ్ టూర్ టీమిండియాకు మరుపురానిదిగా మిగిలిపోయింది. టెస్ట్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకోగా.. టీ20, వన్డే సిరీస్లు రెండింటినీ 2-1 తేడాతో గెలిచింది.
సంబంధిత కథనం