National Herald case: 5వ రోజు ఈడీ ముందుకు రాహుల్​ గాంధీ.. ఇంకెనాళ్లు ఇలా?-national herald case rahul gandhi joins ed probe on 5th day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  National Herald Case: Rahul Gandhi Joins Ed Probe On 5th Day

National Herald case: 5వ రోజు ఈడీ ముందుకు రాహుల్​ గాంధీ.. ఇంకెనాళ్లు ఇలా?

Sharath Chitturi HT Telugu
Jun 21, 2022 01:33 PM IST

National Herald case: రాహుల్​ గాంధీ.. మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఆయన విచారణకు వెళ్లడం ఇది 5వ సారి.

ఈడీ చర్యలకు వ్యతిరేకంగా రాహుల్​ మద్దతుదారుల నిరసన
ఈడీ చర్యలకు వ్యతిరేకంగా రాహుల్​ మద్దతుదారుల నిరసన (HT_PRINT)

National Herald case: నేషనల్​ హెరాల్డ్​ కేసులో భాగంగా మంగళవారం 5వసారి ఈడీ ముందు హాజరయ్యారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. కాంగ్రెస్​ నేతను ఇప్పటికే 40 గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు మరికొన్ని కీలక విషయాలపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్​ నేత, సోదరి ప్రియాంక గాంధీతో మంగళవారం ఉదయం 11:15కు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు రాహుల్​.

ఇల్లు.. ఈడీ కార్యాలయం..

గతం కొన్ని రోజులుగా.. ఇల్లు, ఈడీ కార్యాలయానికే పరిమితమయ్యారు రాహుల్​! ఈ నెల 13న తొలిసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. 14, 15వ తేదీల్లోనూ ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా.. 16వ రోజు గ్యాప్​ ఇచ్చి.. మళ్లీ 17వ తేదీన విచారణ చేపట్టింది. 18వ తేదీన కూడా రాహుల్​ గాంధీ ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంది. కానీ తన తల్లి, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఆయన అభ్యర్థనను అంగీకరించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​.. విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం ఈడీ ముందుకు వెళ్లారు. మంగళవారానికి ముందు.. రాహుల్​ గాంధీని ఈడీ ఇప్పటికే 40కిపైగా గంటలు విచారించింది.

సోనియా కూడా..

నేషనల్​ హెరాల్డ్​ కేసులో భాగంగా సోనియా గాంధీని కూడా విచారించనుంది ఈడీ. వాస్తవానికి ఈ నెల 8నే ఈడీ ఎదుట ఆమె హాజరుకావాల్సి ఉంది. అనారోగ్యం కారణాలతో అది కుదరలేదు. కాగా.. ఈ నెల 23న విచారణకు రావాలని సోనియాకు ఈడీ స్పష్టం చేసింది.

ఇదీ అసలు కథ..

Rahul Gandhi ED case : బ్రిటీష్​ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్​ హెరాల్డ్​. నాటి కాంగ్రెస్​ అధ్యక్షుడు జవహర్​లాల్​ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్​(అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​).. నేషనల్​ హెరాల్డ్​ పత్రికలను ప్రచురించేది.

ఈ నేషనల్​ హెరాల్డ్​ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.

స్వాతంత్ర్యం తర్వాత.. ఈ నేషనల్​ హెరాల్డ్​ను కాంగ్రెస్​ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్​), హిందీ(నవ్​జీవన్​)లోనూ నేషనల్​ హెరాల్డ్​ ఎదిగింది.

దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్​ హెరాల్డ్​ ఛైర్మన్​ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు.

క్రమంగా.. దేశంలో నేషనల్​ హెరాల్డ్​ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్​ పార్టీ.. నేషనల్​ హెరాల్డ్​కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం