Curd Poori | అల్పాహారంలో అయినా, మధ్యాహ్నం మాంసాహారంలో అయినా నంజుకు తినేయండి!
ఆదివారం రోజు బటర్ చికెన్, బటర్ రోటీ తినాలని ఉందా? ఇలాంటిది ఎప్పుడూ తినేదే. రోటీలు కాకుండా బటర్ పూరీ, నేతి పూరీ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోయే ఇక్కడ రెసిపీ ఉంది. నేర్చుకోండి, పూరీలు వేయించుకోండి, పండగ చేస్కోండి.
అల్పాహారాలలో మనకు ఇష్టమైన వంటకాల్లో పూరీ కూడా ఒకటి. బ్రేక్ఫాస్ట్ లో అయినా, లంచ్ లో అయినా, డిన్నర్ లో అయినా జర్నీలో ఎప్పుడైనా మనకు పర్ఫెక్ట్. ఇక ఆదివారం రోజైతే చికెన్, మటన్ కూరలతో పూరీలను నంజుకుని తింటుంటే తనివి తీరుతుంది. రోటీలు వద్దనుకున్నపుడు ఈ పూరీలు మనకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. అయితే మనం బటర్ రోటీ, నేతి రోటీలు చాలా సార్లే తిని ఉంటాం. కానీ పూరీలను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అలాంటి ఒక టేస్టీ రెసిపీని మీకు ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
మీరెప్పుడైనా పెరుగు పూరీలు తిన్నారా? మనం సాధారణంగా పూరీల కోసం పిండి ఒత్తుకొని, నూనెలో గోలించి పూరీలను చేస్తాం. ఈ పెరుగు పూరీల తయారీకి కూడా ప్రాసెస్ అదే అయితే తయారీలో ఉపయోగించే కొన్ని పదార్థాలు అదనంగా చేర్చాల్సి ఉంటుంది.
ఈ రకంగా పూరీలు చేసుకోవటం ద్వారా ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటాయి. మీరు మధ్యాహ్నం తిన్నా, సాయంత్రం తిన్నా మీకు ఎంతో రుచికరంగా చాలా మెత్తగా, మృదువుగా ఉంటాయి. మరి ఆలస్య చేయకుండా పెరుగు పూరీల కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
పెరుగు పూరీ తయారీకి కావలసినవి
- 3 కప్పుల మైదాపిండి
- 3 టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి
- 1/2 కప్పు పెరుగు/ యోగర్ట్
- 1 స్పూన్ ఉప్పు
- వేయించడానికి సరిపడా నూనె
తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపండి. మీరు మైదాపిండి ఎక్కువగా వద్దనుకుంటే గోధుమపిండిని లేదా రెండు పిండిలు కలిపిన పిండిని కూడా ఉపయోగించవచ్చు.
- ఇందులో పెరుగు అవసరం మేరకు నీరు కలపండి పిండి మెత్తగా, ముద్దగా అయ్యేలా బాగా కలపండి. అంటుకోకుండా కొన్ని చుక్కల నూనె కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దను కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టండి.
- ఇక గంట తర్వాత నూనె వేడి చేయండి. మరోవైపు పిండిముద్ద నుంచి కొద్దికొద్దిగా తీసుకొని బాల్స్లా చేసి చుట్టండి. ఆపై పూరీ ఆకారంలో చదునుగా రోల్ చేయండి.
- వీటిని మరుగుతున్న నూనెలో బాగా ఫ్రై చేయండి.
అంతే రుచికరమైన పెరుగు పూరీలు సిద్ధమయినట్లే. ఈ పూరీలను చూస్తే.. నాయాల్ది కత్తి అందుకో జానకీ, ముక్కలు కట్ చేసి కుర్మా వండేసి పెరుగు పూరీలతో నంజుకొని కసాబిసా తినేయాలనిపిస్తుంది.
సంబంధిత కథనం