Food and Medication: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలి (Healthy Lifestyle) అవసరం. అయితే సీజన్ మారేకొద్దీ మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఎవరికి వారే ఫార్మసీకి వెళ్లి తమ సమస్యకు సంబంధించిన ఔషధాలను తీసుకొని వాడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఔషధాలు (Medicines) వాడినా అనారోగ్యం తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. దీనికి కారణం మీ ఆహారం కూడా కావచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆహారం కూడా ఒక ఔషధం లాంటిదేనని. ఆహారంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి, ఇవి మన శరీరంపై ఔషధ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇదేసమయంలో మీరు తీసుకునే ఆహారం, ఇతర ఔషధాలతో ప్రతిచర్య జరపవచ్చు. ఈ ఆహారం-ఔషధ పరస్పర చర్యలు (Food-Drug Interactions) శరీరాన్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మందులతో పాటు మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
ప్రిస్క్రిప్షన్ మందులు, ఓవర్-ది-కౌంటర్ మందులు, విటమిన్లు లేదా సప్లిమెంట్లు తీసుకుంటున్నప్పుడు కొన్ని రకాల ఆహార పానీయాలకు దూరంగా ఉండాలి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఔషధాలు డ్రగ్స్ జాబితాలోకి వస్తాయి, కాబట్టి ఔషధాలు తీసుకునేటపుడు ఆల్కహాల్ లేదా మరేదైనా మత్తు పదార్థాన్ని తీసుకోకూడదు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా, రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కాలేయం చాలా దెబ్బతింటుంది. ఆల్కహాల్తో ఔషధాన్ని తీసుకోవడం వల్ల అనేక కాలేయ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది.
మీరు ఔషధం తీసుకున్నప్పుడు దానితో పాటు ఎనర్జీ డ్రింక్స్ తాగకండి. ఎనర్జీ డ్రింక్స్తో పాటు మందులు తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మందు కరిగిపోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
చాలా ప్రజలు పాలతో పాటు ఔషధాన్ని తీసుకుంటారు. లేదా పాలు తాగిన తర్వాత ఔషధం తీసుకుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. పాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ఇది యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ , ప్రొటీన్లు ఉంటాయి, ఇవి మందులతో కలిపినప్పుడు, ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, యాంటీబయాటిక్స్ తీసుకునేటపుడు పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోకూడదు.
ఆయుర్వేదంలో అతిమధురం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. ఇది జీర్ణవ్యవస్థను బలపేతం చేస్తుంది, అనేక కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ లికోరైస్లో గ్లైసిరైజిన్ సమ్మేళనం ఉంటుంది, ఇది అనేక ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వేగంగా కోలుకోవడానికి ఆకు కూరలు తీసుకోవడం చాలా మంచిది. అయితే, ఆకుకూరలతో పాటు కొన్ని రకాల మందులను తీసుకోవడం వల్ల ఔషధం ప్రభావం దెబ్బతింటుంది. విటమిన్ K అధికంగా ఉండే కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలు ఔషధాల ప్రభావాలకు ఆటంకం కలిగిస్తాయి.
సంబంధిత కథనం