Lokesh Padayatra: 400 రోజులు, 4000 కిలోమీటర్లు - ‘యువగళం’ పేరుతో లోకేశ్ పాదయాత్ర
Nara Lokesh Padayatra News: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకు ‘యువగళం’ పేరు ఖరారు చేశారు. వచ్చే నెల 27 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
Nara Lokesh Padyatra From January 27: ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోతున్నాయి. వై నాట్ 175 అంటూ అధికార వైసీపీ ముందుకెళ్తోంది. ఇక టీడీపీ, జనసేన పార్టీలు కూడా స్పీడ్ ను పెంచాయి. ఇదేం ఖర్మం పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తుండగా... మరోవైపు నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. 2023 జనవరి 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.
మొత్తం 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లోకేశ్ నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను త్వరలో ప్రకటించనుంది టీడీపీ. ఈ మేరకు బుదవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం జెండాను ఆవిష్కరించారు.
యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోడంలో భాగంగా యువగళం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన చేశారు. మొత్తంగా ఏడాది పాటు లోకేశ్ ప్రజల్లో మధ్యనే ఉండేలా కార్యాచరణను రూపొందించారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇతర అంశాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు నేతలు చెప్పారు. రాజధాని నిర్మాణం, రైతాంగం, పెట్టుబడులు, ఆర్థికపరిస్థితి, మహిళల సమస్యలు వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. యువతను పెద్దఎత్తున పాదయాత్రలో భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయాలనేది టీడీపీ ప్లాన్. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో రోడ్ షో.. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. 341 రోజుల్లో 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో... జగన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రవిభజన సమయంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో... టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
టాపిక్