Umran Malik | స్పీడ్ ఒక్కటే సరిపోదు.. స్వింగ్ కూడా ఉండాలి: షాహిన్ అఫ్రిదీ
ఉమ్రాన్ మాలిక్ స్పీడుపై పాక్ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ గురించి చెబుతూ.. వేగం ఒక్కటే సరిపోదని అన్నాడు. జూన్ 8 నుంచి పాక్.. వెస్టిండీస్తో మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్.. పేసర్లకు బాగా అనుకూలించింది. ముఖ్యంగా భారత యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గ్యూసన్ తమ స్పీడుతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించారు. గంటకు 150 కంటే ఎక్కువగా వేగంతో బంతులేసి చుక్కలు చూపించారు. గుజరాత్-రాజస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఫెర్గ్యూసన్ గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అంతకుముందు ఉమ్రామ్ మాలిక్ అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ వీరి వేగవంతమైన బౌలింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
లోకీ ఫెర్గ్యూసన్, ఉమ్రాన్ మాలిక్ స్పీడ్పై షాహిన్ను అడుగ్గా.. స్పీడ్ ఒక్కటే ఉంటే సరిపోదని, దీంతో పాటు లైన్ లెంగ్త్, స్వింగ్ కూడా సరిగ్గా ఉండాలని తెలిపాడు. వేగంతో పాటు స్వింగ్ కూడా చేయాలని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం పాకిస్థాన్.. వెస్టిండీస్తో సొంత గడ్డపై మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడుతోంది. గత డిసెంబరులోనే ఈ సిరీస్ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అప్పుడు కుదరలేదు. స్వదేశంలో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో పాక్ పేసర్ షాహిన్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం విండీస్లోనూ అదే పర్ఫార్మెన్స్ పునరావృతం చేయాలని భావిస్తున్నాడు.
"వరల్డ్ కప్కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ మాకు ఎంతో ముఖ్యం. అందువల్ల ఈ మ్యాచ్ మేము అస్సలు ఓడిపోవాలనుకోవడం లేదు. విండీస్ కూడా బలమైన జట్టు. అందుకే అవకాశం తీసుకోదలచుకోలేదు. అయితే వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇలాంటి సమయంలో మంచి క్రికెట్ ఆడాల్సి ఉంది. ఇది బౌలర్లకు కొంచెం సవాలుతో కూడుకుని ఉన్నప్పటికీ.. ప్రొఫెషనల్ ఆటగాళ్లకు వేసవి సరైన సమయం." అని షాహిన్ తెలిపాడు. వెస్డిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పాకిస్థాన్ జూన్ 3 నుంచి ఆడనుంది. ముల్తాన్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
సంబంధిత కథనం
టాపిక్