BCCI | అండర్-19 టీమ్కు నజరానా ప్రకటించిన బీసీసీఐ
రికార్డు స్థాయిలో ఐదోసారి ఇండియాకు అండర్-19 వరల్డ్ కప్ సాధించిపెట్టిన టీమ్కు నజరానా ప్రకటించింది బీసీసీఐ. టీమ్ గెలిచిన వెంటనే బోర్డు ఈ ప్రకటన చేయడం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్పై 4 వికెట్లతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.
ముంబై: యంగిండియాపై అప్పుడే వరాల జల్లు ప్రారంభమైంది. అండర్-19 క్రికెట్లో మరోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమ్లోని ఒక్కో సభ్యునికి రూ. 40 లక్షలు ఇవ్వనున్నట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శి జే షా ప్రకటించారు.
ఇక సపోర్ట్ స్టాఫ్లోని ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు కూడా ఆయన చెప్పారు. మీరు ఇండియాను గర్వపడేలా చేశారంటూ షా ట్వీట్ చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి సాధించిన వెరీ వెరీ స్పెషల్ విజయం ఇది అని వీవీఎస్ లక్ష్మణ్ను ఉద్దేశించి షా మరో ట్వీట్ చేశారు.
నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న లక్ష్మణ్.. మొదటి నుంచీ వరల్డ్కప్లో టీమ్ వెంటే ఉన్నాడు. గత రెండు వరల్డ్కప్లలో మరో మాజీ, ఇప్పటి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాగైతే యువ క్రికెటర్లను వెన్నుతట్టి ప్రోత్సహించాడో.. ఈసారి లక్ష్మణ్ అలాగే వాళ్లలో ఉత్సాహం నింపాడు.
అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా టీమ్పై ప్రశంసలు కురిపించాడు. వాళ్లకు ఇస్తున్న ఈ రూ.40 లక్షలు చాలా చిన్న మొత్తమని, వాళ్లు సాధించిన విజయం మరెంతో విలువైనదని ఆయన అన్నారు.
సంబంధిత కథనం