End-stage liver disease: మీ లివర్ బిస్కెట్ అయ్యిందనడానికి సంకేతాలు ఇవే
End-stage liver disease symptoms: మీ లివర్ ఇక పనిచేయని దశకు వచ్చిందని చెప్పడానికి కొన్ని లక్షణాలను గమనించాలి.
లివర్ డ్యామేజ్ విషయానికి వస్తే చాలా కేసుల్లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో ఇన్ఫ్లమేషన్ ఉంటే.. చివరగా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ (ఈఎస్ఎల్డీ) అనే దశ ఉంటుంది. లివర్ వ్యాధి పెరుగుతున్న కొద్దీ లివర్ డ్యామేజ్ పెరుగుతూ పోతుంటుంది. అంతిమంగా కాలేయం తన విధులు నిర్వర్తించలేకపోతుంది.
లివర్ డిసీజ్లో నాలుగు దశలు
1. ఇన్ఫ్లమేషన్ (వ్యాధి కారకాలతో పోరాడుతున్నప్పుడు వచ్చే వాపు, మంట)
2. ఫైబ్రాసిస్
3. సిరోసిస్
4. ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ (ఈఎస్ఎల్డీ)
గ్లోబల్ హాస్పిటల్స్ లివర్, పాంక్రియాస్, ఇంటెస్టిన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ చౌబల్ హెచ్టీ లైఫ్స్టైల్కు ఇచ్చని ఇంటర్వ్యూలో లివర్ ఆరోగ్యంపై మాట్లాడారు. ‘హెపటైటిస్ సీ చివరి దశకు చేరుకుంటే లివర్ డామేజ్ గణనీయంగా ఉంటుంది. కొన్నేళ్లపాటు హెపటైటిస్ సీ వైరస్ క్రమంగా లివర్ను డ్యామేజ్ చేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్తో మొదలవుతుంది. ఈ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. సిరోసిస్ దశ రావడానికి ముందు చాలా ఏళ్లు పట్టొచ్చు..’ అని వివరించారు.
ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ (ఈఎస్ఎల్డీ) గురించి మాట్లాడుతూ ‘ఈఎస్ఎల్డీ దశను స్టేజ్ 4 సిరోసిస్గా కూడా పిలుస్తారు. హెపటైటిస్ సీ కారణంగా లివర్ వైఫల్యం చెందుతుంది. ఈ దశలో లివర్ తన విధులను నిర్వర్తించలేదు. హెపాటిక్ ఎన్సెఫలోపతి, అస్సైట్స్ అనే ఒక రకమైన పొత్తికడుపు వాపు ఏర్పడుతుంది. ఈ సమయంలో దీనికి ఉన్న ఏకైక చికిత్స కాలేయ మార్పిడి మాత్రమే..’ అని వివరించారు.
‘ఒకవేళ మీకు ఈఎస్ఎల్డీ ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. డ్యామేజ్ అయిన లివర్ స్థానంలో ఒక ఆరోగ్యవంతుడైన అవయవ దాత నుంచి సేకరించిన లివర్ను మార్పిడి చేస్తారు. సిరోసిస్ విషయంలో వ్యాధి తీవ్రత మరింత దిగజారకుండా చికిత్స అందిస్తారు. జరుగుతున్న హాని తగ్గించేలా ఆ చికిత్స ఉంటుంది..’ అని వివరించారు.
ఈఎస్ఎల్డీ లక్షణాలు ఇవీ
- రక్త స్రావం
- నిరంతరం మీ చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం (జాండీస్)
- విపరీతమైన దురద
- బాధించే నొప్పి
- ఆకలి లేకపోవడం
- వికారం
- మీ కాళ్లు, పొత్తికడుపులోకి ద్రవం చేరి వాపు రావడం
- మెమొరీ, ఏకాగ్రత సమస్యలు రావడం
సిరోసిస్ పురోగమించడం వల్ల కాలేయం పనిచేయకుండా పోతుందని, దాదాపు లివర్ చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయని చెప్పారు. సిరోసిస్ ఉన్న వారిలో కింది పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వివరించారు.
గొంతు, కడుపును కలిపే అన్నవాహిత ట్యూబులో సిరల వాపు ఏర్పడి ఎసోఫాగియల్ వేరిసెస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. దీని వల్ల గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్లో రక్తస్రావం జరుగుతుంది. రక్తంలో విషపదార్థాలు చేరడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవుతుందని చెప్పారు.
సంబంధిత కథనం