YS Sharmila On BRS: ఆ సోమ్ముతోనే బందిపోటుల రాష్ట్ర సమితి… KCRపై షర్మిల ఫైర్
YS Sharmila slams KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. దోచుకున్న సోమ్ముతో బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని విమర్శించారు.
YS Sharmila Comments on BRS Party: టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల.పాదయాత్రలో భాగంగా నర్సంపేటలో పర్యటించిన ఆమె... వర్షాలకు పంట నష్టపోయి ఏడాది కావొస్తున్నా కనీసం పరిహారం అందలేదని దుయ్యబట్టారు. మంత్రులు హెలికాప్టర్ లో తిరిగారు తప్పితే నయాపైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ సంపద మొత్తం కేసీఆర్ ఇంట్లోకే పోయిందని విమర్శించారు. దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్... అనే బందిపోట్ల రాష్ట్ర సమితి పెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణను ఆగంజేసి, దేశాన్ని ఏలబోతాడట దొర అంటూ మండిపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
బంగారంలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుక్కలు చింపిన విస్తరిలా చేశారని షర్మిల ఆక్షేపించారు. రూ.4లక్షల కోట్ల అప్పులు చేసి, ఇప్పుడు జీతాలకు, పథకాలకు నిధులు బంద్ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కొత్త పథకాలతో ఊరిస్తున్నారని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం వస్తేనే సంక్షేమ పాలన వస్తుందని చెప్పారు. అప్పుడే మన బతుకులు బాగుపడతాయని చెప్పారు.
హత్యకు కేసీఆరే కారణం...
ఇక శుక్రవారం ములుగులో పర్యటించిన షర్మిల... కేసీఆర్ సీఎం అయ్యాక.. పోడు రైతులపై వేలాది కేసులు పెట్టారని ఆరోపించారు. అట్టడుగు వర్గాలకు రక్షణ కల్పించాల్సిన వారే వారిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోడు సమస్యను పరిష్కరించాలన్నారు. ఫారెస్ట్ అధికారి హత్యకు కేసీఆరే కారణమన్నారు.
మరోవైపు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించినట్లు తెలుస్తోంది. వాళ్లను వాళ్ల స్వరాష్ట్రమైన ఛత్తీస్గఢ్కు పంపాలని నిర్ణయించింది.