Rajanna Sircilla : సిరిసిల్లలో దారుణం - మహిళపై వలస కూలీల అత్యాచారం, ఆపై హత్య..!
Rajanna Sircilla District News: సిరిసిల్లలో దారుణం వెలుగు చూసింది. కూలీ పనులు చేసుకునే మహిళపై ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajanna Sircilla District News: కార్మిక క్షేత్రం సిరిసిల్లలో(Rajanna Sircilla) దారుణం జరిగింది. కూలీ పనికి వెళ్ళిన మహిళపై వలస కూలీలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేసి పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
బిహారీల కూలీల పనే…!
సిరిసిల్ల అనంతనగర్ లో ఓ ఇంట్లో బిహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు ఆరు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. నలుగురు వ్యక్తులు 15 రోజుల క్రితం బిహార్ వెళ్లారు. రాముబ్రిక్ష సదా, రూడల్ సదా అనే ఇద్దరు నాలుగు రోజుల కిందట ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వారు కనిపించలేదు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని రామస్వామి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రఘుపతి సంఘటన స్థలానికి వెళ్లి ఇంటి తాళం పగులగొట్టి చూడగా రక్తపు మడుగులో మహిళ మృతదేహం ఉంది. ఆమె తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. గదిలో మద్యం సీసాలు ఉండటంతో మద్యం మత్తులో కార్మికులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన బిహారీ కార్మికులు మారిపోవడంతో పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
హతురాలు రమ….
హత్యకు గురైన మహిళ వేములవాడ మండలం కొడుముంజకు చెందిన ఆలకుంట రమ (41) గా పోలీసులు గుర్తించారు. రమ భర్త రాజయ్య మూడు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి ముగ్గురు కూమార్తెలు ఉండగా, ఇద్దరికి పెళ్ళి చేసింది. రమ దినసరికూలీ పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తుంది. కూలీ పనికోసం సిరిసిల్ల కు వచ్చిన మహిళను ఈనెల 19న బీహార్ వలసకూలీలు తమ రూమ్ కు తీసుకు వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ రఘుపతి తెలిపారు