(1 / 6)
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్గెటింగ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం శనివారం సమీక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు.
(2 / 6)
నిత్యావసరాల ధరలు పెరిగిన తరువాత తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం కంటే....సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే అంచనా వేసి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు.
(3 / 6)
నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించి కీలక సూచనలు చేశారు.
(4 / 6)
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన సమీక్షలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆన్లైన్ లో హాజరయ్యారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన నిత్యావసరాల అమ్మకాలపై అధికారులు సమీక్షలో వివరించారు.
(5 / 6)
పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయలు రైతు బజార్ లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు మంత్రులు, అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
(6 / 6)
బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడంతో రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే హర్షిస్తారన్నారు. ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇతర గ్యాలరీలు