Raksha Bandhan recipes: రాఖీ పండగ రోజు ఈ బెస్ట్ లంచ్ రెసిపీలు ట్రై చేయండి..
Raksha Bandhan recipes: పూరీ కర్రీ నుంచి మసాలా పులావ్ దాకా రాఖీ పండగ రోజు సులభంగా, రుచిగా చేసుకోదగ్గ లంచ్ రెసిపీలు చూసేయండి. పండగను ప్రత్యేకంగా మార్చేయండి.
రక్షాబంధన్ రోజు కూడా మామూలు భోజనం చేస్తే ఎలా? కాస్త ప్రత్యేకంగా ఉండాల్సిందే. అందుకే మీకోసం సులభంగా, రుచిగా ఉండే కొన్ని లంచ్ రెసిపీలు తీసుకొచ్చాం. ఈ రుచికరమైన వంటలతో రాఖీ పండగ రోజున ఘుమఘుమలతో అదరగొట్టేయండి.
రాఖీ పండగ కోసం లంచ్ రెసిపీలు:
1. పూరీ భాజీ:
కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల గోధుమ పిండి
2 చెంచాల రవ్వ
తగినంత ఉప్పు
కొన్ని నీళ్లు
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
ఆలూ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు:
3 చెంచాల నెయ్యి
చిటికెడు ఇంగువ
2 చెంచాల జీలకర్ర
2 చెంచాల ధనియాలు
1 పచ్చిమిర్చి
1 చెంచా అల్లం తురుము
1 చెంచా పసుపు
1 చెంచా కారం
1 చెంచా ధనియాల పొడి
1 కప్పు తరిగిన టమాటా ముక్కలు
5 ఉడికించిన బంగాళదుంపలు
4 కప్పుల నీల్లు
కొద్దిగా గరం మసాలా
కొద్దిగా కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
- కడాయిలో నెయ్యి వేసుకొని ఇంగువ, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. అవి చిటపటలాడాక పచ్చిమిర్చి, అల్లం తురుము వేయాలి. అవి వేగాక మిగతా మసాలాలన్నీ కలిపి ఒకసారి కలుపుకోవాలి.
- ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలపాలు. టమాటాలు మెత్తబడ్డాక బంగాళదుంపల్ని మెదిపి వేసుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి.
- ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసుకుని ఒక ఉడుకు వచ్చే దాకా ఆగాలి. తర్వాత గరం మసాలా వేసుకుని కూర గట్టిపడగానే కొత్తిమీర తరుగు వేసి దింపేసుకుంటే చాలు. కూర సిద్ధం.
- పూరీ కోసం గోధుమ పిండిలో రవ్వ, ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చివరగా కాస్త నూనె రాసుకుని పిండి ముద్దను ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పిండిని ఉండల్లా చేసుకుని పూరీలు ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చాలు.
- పూరీని ఆలూ కర్రీతో సర్వ్ చేసేయండి.
2. లచ్చా పన్నీర్ పరాటా:
కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు పన్నీర్ తురుము
1 కప్పు గోధుమ పిండి
2 చెంచాల పచ్చిమిర్చి
2 చెంచాల కొత్తిమీర తరుగు
సగం చెంచా జీలకర్ర పొడి
తగినంత ఉప్పు
2 చెంచాల నెయ్యి
తగినంత నూనె
తయారీ విధానం:
- ముందుగా పన్నీర్ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.
- ఈ పిండిని నాలుగు భాగాలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్రతి భాగాన్ని చపాతీలాగా కాస్త మందంగా ఒత్తుకొని పన్నీర్ మిశ్రమం అంతటా రాయాలి. దాని మీద మరో చపాతీ పెట్టుకోవాలి. ఇప్పుడు నాలుగు చపాతీలు ఒకదాని మీద ఒకటి పన్నీర్ మిశ్రమం రాసుకుంటూ పెట్టుకోవాలి.
- కొనలన్నీ బాగా ఒత్తుకుని అన్నింటినీ కలపి చపాతీ లాగా సన్నగా చేసుకుంటూ పోవాలి.
- కాస్త మందంగా ఉన్నప్పుడే దాన్ని 6 సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని చేతుల్లోకి తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి.
- నాన్ స్టిక్ పెనం మీద వీటిని నూనె వేసుకుని కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా పరాటాలు కూడా చేసుకుని సిద్ధం చేసుకోవాలి.
3. వెజిటేబుల్ పులావ్:
కావాల్సిన పదార్థాలు:
5 చెంచాల నూనె
1 నల్ల యాలకులు
7 మిరియాలు
2 చెంచాల జీలకర్ర
3 పచ్చిమిర్చి
1 కప్పు ఉల్లిపాయ ముక్కలు
1 కప్పు బంగాళదుంప ముక్కలు
సగం కప్పు క్యారట్ ముక్కలు
సగం కప్పు బీన్స్
తగినంత ఉప్పు
4 కప్పుల నీళ్లు
2 కప్పుల బాస్మతీ బియ్యం
సగం కప్పు బటానీ
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని కడుక్కుని అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలలో నూనె వేసుకుని నల్లయాలకులు, మిరియాలు, జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి.
- పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుని రెండు నమిషాలు వేగనివ్వాలి.
- బంగాళదుంపలు, క్యారట్, బీన్స్, ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 4 కప్పుల నీళ్లు పోసుకుని ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి.
- నీళ్లు కాస్త ఇంకిపోయాక బటానీ కూడా వేసి నీళ్లు మొత్తం పోయి, బియ్యం ఉడికేంత వరకు ఆగాలి. అంతే..
4. చోలె బటురే:
కావాల్సిన పదార్థాలు:
చోలే కోసం:
1 కప్పు రాత్రి నానబెట్టుకున్న శనగలు
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా కారం
పావు చెంచా పసుపు
1 చెంచా మసాలా పొడి
1 చెంచా ఆమ్ చూర్ పొడి
చిటికెడు ఇంగువ
కొద్దిగా ఉప్పు
2 కప్పుల నీళ్లు
1 చెంచా జీలకర్ర
1 బిర్యానీ ఆకు
అంగుళం దాల్చిన చెక్క ముక్క
2 లవంగాలు
2 యాలకులు
2 మిరియాలు
1 ఉల్లిపాయ ముక్కలు
2 టమాటాల ముక్కలు
అర అంగుళం అల్లం ముక్క
3 వెల్లుల్లి రెబ్బలు
బటురా కోసం:
2 కప్పుల మైదా
1 చెంచా రవ్వ
4 చెంచాల పెరుగు
1 చెంచా నూనె
తగినంత ఉప్పు
సగం చెంచా పంచదార
పావు చెంచా బేకింగ్ పౌడర్
డీప్ ఫ్రై సరిపడా నూనె
తయారీ విధానం:
- ముందుగా 4 విజిల్స్ వచ్చేదాకా శనగలను ఉడికించుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని మసాలాలన్నీ వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమం కూడా నూనెలో వేసుకోవాలి.
- నూనె పైకి తేలేదాకా ఆగి, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన శనగలు, ఉప్పు వేసుకుని కలపాలి.
- ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి, గ్రేవీ చిక్కబడ్డాక మసాలా వేసుకుని కలుపుకుని దింపేయాలి.
- బటురే కోసం మైదా, రవ్వ, ఉప్పు, పెరుగు వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి.
- 2 గంటలు పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకుని పూరీలు ఒత్తుకోవాలి. ఇవి మరీ మందంగా లేదా పలుచగా ఉండొద్దు.
- వీటిని వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. చోలె బటూరె సిద్ధం.