CM Jagan On Secretariats: సచివాలయాల్లో 'స్పందన'.. ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
cm jagan on village and ward secretariats: పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామన్నారు ఏపీ సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన ముఖ్యమంత్రి.. అధికారులకు దిశానిర్దేశం
village and ward secretariats in ap:గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామన్న ఆయన... చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని... సరైన ఎస్ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. సిబ్బంది హాజరు దగ్గర నుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలన్న ముఖ్యమమంత్రి... గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు
"రిపోర్టింగ్ స్ట్రక్చర్ పటిష్టంగా ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలి. విధులు, బాధ్యతలపై ఎస్ఓపీలు ఉండాలి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనది. వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలి. రీ వెరిఫికేషన్ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అన్నడం అన్నది ప్రధానం. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. అధికారులు ఓనర్షిప్ తీసుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల 2 సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుంది. సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవలు అందాలి" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారన్న ముఖ్యమంత్రి జగన్... వారి సేవలు ప్రజలకు అందాలని సూచించారు. అప్పుడే ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగం, అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతామని చెప్పారు. సిబ్బందితో మంచి సమన్వయం కోసం, వారు అందుబాటులో ఉండేలా మెరుగైన విధానాలను అవలంభించాలని.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వీటన్నింటి లక్ష్యమని... అందుకనే ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ ఫేషియల్ రికగ్నైజేషన్తో కూడిన హాజరును అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారన్న ముఖ్యమంత్రి... దీనివల్ల సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారంపై దృష్టిపెడతారని వ్యాఖ్యానించారు. లేకపోతే అంతిమంగా ఇబ్బందులు పడేది ప్రజలే అని అన్నారు.
"సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలి. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలం. గ్రామస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలం. లేకపోతే ఆ లక్ష్యాల సాధనలో పురోగతి కనిపించదు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో ఏపీ నంబర్ఒన్గా నిలవాలి. అలాగే సచివాలయాల్లో సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూదు. టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరికరాల పరంగా వారికి లోటు ఉండకూడదు. నిరంతరం టెక్నాలజీని అప్డేట్ చేయాలి, వారిని అప్డేట్గా ఉంచాలి" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
భర్తీకి గ్రీన్ సిగ్నల్,,,
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చిందని.. మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్రసచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలని.. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం వైర్లెస్ ఇంటర్నెట్తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలని అధికారులు చెప్పుకొచ్చారు. అంగన్వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని సీఎం చెప్పారు.