TS Teachers Transfer Schedule: రేపట్నుంచే టీచర్ల బదిలీలు.. మార్గదర్శకాలివే
Telangana Teachers Transfer Updates: రేపట్నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సర్కార్ జీవో జారీ చేసింది.
Schedule for Transfers and Promotions of Teachers: తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రక్రియ షురూ కానుంది. జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను సర్కార్ విడుదల చేసింది. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ జీవో నెంబరు 5 జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ట్రెండింగ్ వార్తలు
షెడ్యూల్ ఇదే...
ఖాళీల వివరాలను జనవరి 27వ తేదీన ప్రకటిస్తారు. ఈనెల 28 నుంచి ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్ఈవోలకు.. మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాలి. మార్చి 4వరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుందని షెడ్యూల్ లో వివరించారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ఉంటాయి. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్టు జీవోలో వెల్లడించారు.
మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేస్తారు. ఆయా స్థానాల్లో మహిళలను నియమించనున్నారు. ఒక వేళ మహిళా ఉపాధ్యాయులు లేకపోతే 50 ఏళ్లు దాటిన పురుషులను నియమిస్తారని సర్కార్ స్పష్టం చేసింది.
మార్చి 4 వరకు.. అంటే 37 రోజుల్లో .. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది ఉపాధ్యాయులు అర్హత సాధిస్తారని.. దాదాపు 11 వేల మంది ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో.. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న దంపతులు.. తమకూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పౌజ్ బదిలీల్లో అవకాశం కల్పించాలని.. భార్య, భర్త ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం