Telangana Government : టీచర్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల.. ఉద్యోగులకు డీఏ మంజూరు...
Telangana Government : ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 27 నుంచి మార్చి 4 వరకు ప్రక్రియ ఉంటుందని ప్రకటించింది. అప్పీళ్ల కోసం 15 రోజుల గడువు ఇచ్చింది. ఉద్యోగులకి ఒక డీఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Teachers Transfers Schedule : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 27 నుంచి ప్రక్రియ చేపడుతూ.. ప్రభుత్వం షెడ్యూల్ వెలువరించింది. జనవరి 28న మొదలై... మార్చి 4 నాటికి ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. వీటిపై అప్పీళ్ల కోసం మరో రెండు వారాల గడువు ఇచ్చారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టీచర్ల దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. ఈ మేరకు సమగ్ర షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేసింది.
షెడ్యూల్ ఇదే...
జనవరి 27 నుంచి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు మొదలు కానున్నాయి. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.... మార్చి 4 నాటికి ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తారు. కేటాయింపులపై మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు.
డీఏ మంజూరు
Telangana Government Sanctions DA : మరోవైపు... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
2021 జూలై నుంచి పెంచిన డీఏ చెల్లించనుంది. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు బకాయిలు చెల్లించనుంది. మొత్తంగా 8 విడతల్లో డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జనవరి పింఛనుతో కలిపి పింఛనుదారులకి ఫిబ్రవరిలో డీఏ చెల్లింపులు చేయనున్నారు.
ఆగని ఆందోళనలు...
మార్చి 4 వరకు.. అంటే 37 రోజుల్లో .. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది ఉపాధ్యాయులు అర్హత సాధిస్తారని.. దాదాపు 11 వేల మంది ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో.. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న దంపతులు.. తమకూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పౌజ్ బదిలీల్లో అవకాశం కల్పించాలని.. భార్య, భర్త ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. శనివారం 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు... హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్, సంచాలకుల కార్యాలయం ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీచర్ దంపతులు... పిల్లలతో కలిసి నిరసనకు దిగారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యాయులు తమ పిల్లలతో కలిసి ఆదివారం మరోసారి ఆందోళనకు దిగారు. జీవో 317ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ... ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో... ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.