KTR Postcard To Modi: కేంద్రంపై మంత్రి కేటీఆర్ సరికొత్త ఉద్యమం.. విషయం ఇదే!
KTR Postcard to pm modi: చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని మోదీ తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన స్వదస్తూరితో పోస్ట్ కార్డును రాశారు.
Minister KTR Write Letter to PM Modi: చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు... స్వయంగా తన స్వదస్తూరితో ఓ పోస్టు కార్డును కూడా రాసి... పీఎం కార్యాలయానికి పంపారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని కేటీఆర్ చెప్పారు. వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిందని విమర్శించారు.
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే అన్నారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్ భారత్, గాంధీ మహాత్ముడి సూత్రాలను చెప్పే కేంద్ర ప్రభుత్వం... తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగంలో కీలకమైన నేత కార్మికులను కష్టాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు.
ఈ మేరకు ప్రగతి భవన్ నుంచి చేనేత కార్మికుల పక్షాన పోస్ట్ కార్డును రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు అందరితోపాటు చేనేత కార్మికులు వారి ఉత్పత్తుల పట్ల ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.