IRCTC Tirumala Package : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక ప్రవేశ దర్శనంతో టూర్ ప్యాకేజీ
IRCTC Tirumala Package : తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ గోవిందం పేరుతో రైల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
IRCTC Tirumala Package : తిరుమలలో వేసవి రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ప్రత్యేక దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తుంది. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు రాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 'విజయ్ గోవిందం' పేరుతో రైల్ టూర్ ప్యాకేజీ ఐఆర్సీటీసీ ఆపరేట్ చేస్తుంది. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ నుంచి ప్రతీ రోజూ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా కల్పిస్తుంది ఐఆర్సీటీసీ. ఈ ప్యాకేజీలో తిరుచానూర్లో పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు.
ఐఆర్సీటీసీ తిరుపతి ప్యాకేజీలో మొదటి రోజు హైదరాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిను బయలుదేరుతుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు 6.10 గంటలకు సికింద్రాబాద్లో, రాత్రి 7.38 గంటలకు నల్గొండలో ఈ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం ఈ రైలు తిరుపతి చేరుకుంటారు. హోటల్లో ప్రెష్ అయిన తర్వాత ఉదయం 9 గంటలకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి... తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. తిరుచానూర్లో పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత పర్యాటకులను అదే రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 5.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. లింగంపల్లికి 6.55 గంటలకు రైలు చేరుకుంటుంది.
తిరుపతి టూర్ ప్యాకేజీలో ఐఆర్సీటీసీ కంఫర్ట్, స్టాండర్ట్ ను అందుబాటులో ఉంచింది. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్, ట్విన్ షేరింగ్కు రూ.3,800, సింగిల్ షేరింగ్కు రూ.4,940 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్, ట్విన్ షేరింగ్కు రూ.5,660, సింగిల్ షేరింగ్ ధర రూ.6,790గా నిర్ణయించారు. అయితే కంఫర్ట్ ప్యాకేజీలో 3rd AC లో ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. అదే విధంగా ఏసీ హోటల్, ఏసీ వాహనంలో ప్రయాణం, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఉంటాయి. అలాగే ఈ ప్యాకేజీకి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీలోనే తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా కలిపే ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు www.irctctourism.com వెబ్సైట్ ను విజిట్ చేయవచ్చు.
సంబంధిత కథనం