Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్.. CBI విచారణను వీడియో తీయాలంటూ అవినాష్ రెడ్డి పిటిషన్
MP Avinash Reddy Filed a Writ Petition: తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసులో తనపై జరుగుతున్న సీబీఐ విచారణపై స్టే విధించాలని కోరారు. కేసులోని నిజానిజాలను సీబీఐ పట్టుంచుకోవటం లేదన్నారు.
MP Avinash Reddy Filed a Writ Petition in Telangana High Court: వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. తన విచారణపై స్టే విదించాలని కోరారు. సీబీఐ తనను విచారించే సమయంలో.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పిటిషన్ లో ప్రస్తావించారు. పలుమార్లు కోరినా సీబీఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదని పేర్కొన్నారు.
160 CRPC నోటీస్ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్రెడ్డి తన పిటిషన్ లో కోరారు. వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని.. ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని... దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోంది చెప్పారు.
తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అవినాష్రెడ్డి తెలిపారు. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సీబీఐ తనని వేదిస్తోందని వివరించారు. స్పాట్ లో దొరికిన లేఖపై సిబిఐ దర్యాప్తు చేయటంలేదన్నారు.
"వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని.. అదే కోణంలో విచారణ చేస్తున్నారు.తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్షీట్ లో నేరస్తునిగా సీబీఐ చిత్రీకరిస్తుంది. కేసులో నిజానిజాలను సీబీఐ పట్టుంచుకోవటం లేదు. నిస్పక్షపాతమైన విచారణ జరిగేలా సీబీఐని ఆదేశించాలి" అని తన పిటిషన్ లో ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు సీబీఐ నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి… విచారణకు కూడా హాజరయ్యారు. ఇక ఆయన తండ్రికి కూడా నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం