CM Jagan Tirumala Visit: ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్
cm ys jagan tirumala tour: ఈనెల 27వ తేదీన సీఎం జగన్ తిరుమలలో పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 28వ తేదీ సీఎం జగన్ చేతుల మీదుగా నూతన పరకామణి భవనం ప్రారంభం కానుంది.
cm ys jagan to visits tirumala: ఈనెల 27 న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 28వ తేదీ సీఎం చేతులమీదుగా నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం జరగుతుందని చెప్పారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... భక్తులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
tirumala brahmotsavam 2022: ఈ నెల 27 నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ధర్మారెడ్డి. శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ తర్వాత... రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని వెల్లడించారు. ఆధునిక వసతులతో ఏర్పాటుచేసిన పరకామణి భవనంలో కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయం నుంచి హుండీలను బ్యాటరీ కార్ల ద్వారా పరకామణి భవనానికి తరలిస్తామని చెప్పారు. కానుకలు లెక్కించేందుకు సిబ్బంది కింద కూర్చోవాల్సిన అవసరం లేకుండా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. నాణేలను వేరు చేసేందుకు రూ.2.50 కోట్లతో కాయిన్స్ ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ తర్వాత మరో యంత్రం సాయంతో కౌంటింగ్, ప్యాకింగ్ చేస్తామని తెలియజేశారు.
దుష్ప్రచారాన్ని నమ్మకండి
శ్రీవాణి ట్రస్టు నిధులను ఆలయ నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగిస్తున్నామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్నాయని కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. ఈ ట్రస్టుకు ఇప్పటివరకు రూ.516 కోట్ల విరాళాలు అందాయని తెలియజేశారు. ఈ నిధులతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో 1342 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, ఆయా ఆలయాల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారని తెలియజేశారు. సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో రెండో దశలో 111 ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లోని గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో ఆలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పూర్తయిన ఆలయాలకు ధూప దీప నైవేద్యాలతో కోసం ప్రతినెలా రూ.2 వేలు అందించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. ఈ ఆలయాలను ఆడిట్ బృందం సందర్శించి ఆలయ నిర్వహణ, నిధుల వ్యయంపై ఆడిట్ చేస్తుందని స్పష్టం చేశారు.
శ్రీవారి ఆలయ బంగారు తాపడం విధివిధానాలపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి చెప్పారు. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమికి నిబంధనల ప్రకారం లీజు పొంది స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ స్థలం సముద్ర తీరప్రాంతంలో ఉండడంతో కోస్టల్ రెగ్యులేషన్ జోన్(CRZ) అనుమతి అవసరం అయింది అన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేశామని, దీంతోపాటు ఆలయ ప్లానుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లభించిన తర్వాత ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని తెలియజేశారు.
సంబంధిత కథనం