Global Investors Summit: 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే మా టార్గెట్ - మంత్రి అమర్నాథ్
global investors summit 2023: వైజాగ్ వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
Global investors summit 2023 at Vizag: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సుకు సర్వం సిద్ధమైంది. అయితే ఈ సదస్సు ద్వారా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించటమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభం కానుందని చెప్పారు. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయన్నారు. ఇప్పటికే Advantage.ap.in లో 14వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. శుక్రవారం వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం జరిగిందని... సీఎం జగన్ గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుంటారని వెల్లడించారు. ఆ తర్వాత రేపు జరగబోయే సదస్సుకు సంబంధించి అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
"శుక్రవారం 10.15 గంటలకు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ రేపు 2 గంటల ఉంటుంది. అదేవిధంగా రేపు కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించకున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పై చిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్ లో పాల్గొంటారు” అని మంత్రి అమర్నాథ్ వివరించారు.
పెట్టుబడుల ద్వారా అధిక ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు మంత్రి అమర్నాథ్. సీఎం జగన్ అంటే క్రెడిబిలిటీ అని... వారి నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుంది చెప్పారు. శుక్రవారం కూడా అదే నమ్మకాన్ని గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పించనున్నామని తెలిపారు. రాష్ట్ర ఎకానమీని అభివృద్ధి చేయడం, అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వివరించారు. 46 దేశాల ప్రముఖులు ఈ సదస్సుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా వస్తున్నారని.. వారికి రేపు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విందు కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు.
పెట్టుబడులు పెట్టేవారికి భూములతో పాటు అన్ని అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. చేసుకున్న ఎంవోయూలను ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం సూచించారని వెల్లడించారు. అదేవిధంగా, ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్ లను క్రియేట్ చేశామన్నారు. ఈ సదస్సు వేదికగా మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్ గా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ సమస్య లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీని రేపే మేం ప్రకటిస్తామని.. లేదంటే 15 రోజుల తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుందన్నారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని సమీక్షించనున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసుకునే ఎంవోయూలలో 80 శాతం రియలైజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత కథనం