Meters For Farm Motors in AP: మొత్తం 18 లక్షల స్మార్ట్ మీటర్లు బిగిస్తాం - ఏపీ ఇంధన శాఖ-andhra to install 18 lakh smart meters on farm motors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra To Install 18 Lakh Smart Meters On Farm Motors

Meters For Farm Motors in AP: మొత్తం 18 లక్షల స్మార్ట్ మీటర్లు బిగిస్తాం - ఏపీ ఇంధన శాఖ

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 02:57 PM IST

Smart Meters for Farm Pumpsets in Andhrapradesh: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏపీలో వేగంగా జరుగుతున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ఇంధన శాఖ. మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పలు వివరాలను వెల్లడించారు.

ఏపీలో మోటర్లకు మీటర్లు
ఏపీలో మోటర్లకు మీటర్లు

Smart meters for farm pumpsets in AP: వ్యవసాయం మోటర్లకు స్మార్ట్ మీటర్లపై ఎలాంటి అపోహలు నమ్మవద్దన్నారు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేత ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. వాస్తవిక దృక్పథంతో, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే డిస్కంలు, ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించాయని స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ విద్యుత్ సౌథలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ రైతు ఎంత విద్యుత్ ను వినియోగిస్తున్నారు, దానికి ప్రభుత్వం నెలవారీగా ఎంత సబ్సిడీ ఇస్తోంది అనే అంశాలను పూర్తిస్థాయిలో రైతుకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న రైతులు నాణ్యమైన విద్యుత్ విషయంలో డిస్కంలను, అధికారులను ప్రశ్నించవచ్చన్నారు. ప్రభుత్వం ద్వారా పొందుతున్న రాయితీలను రైతులు తెలుసుకోవాలన్నదే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు.

దుష్ప్రచారం సరికాదు…

రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయడంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. రైతులను అనవసర ఆందోళనలకు, అయోమయానికి గురిచేయవద్దని కోరారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేపట్టిందని..అందులో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పటికే పలుమార్లు వివరించామన్నారు. స్మార్ట్ మీటర్ల స్థానంలో ఐఆర్ మీటర్లు, డీటీ మీటర్లు, ఫీడర్ మీటర్లు ఎందుకు పెట్టకూడదనే ప్రశ్నలకు గతంలోనే సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఒక మోటార్ కు మీటర్ బిగించడం ద్వారా రైతు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాడనేది కచ్చితంగా తెలుస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్ డాక్యుమెంట్ ను న్యాయసమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్లను ఖరారు చేయడం జరిగిందన్నారు. స్మార్ట్ మీటర్లు, అలైడ్ మెటీరియల్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.1,600 కోట్లకు పైగా గ్రాంటు కూడా వస్తుందన్నారు. రైతుల ప్రాణరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని మీటర్ల ఏర్పాటులో అవసరమైన అలైడ్ మెటీరియల్ ఉపయోగించడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయిన విషయాన్ని విజయానంద్ గుర్తుచేశారు. ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ రిపోర్టు లెక్కలు ఏడాదిన్నర క్రిందటివని అయితే తాము చెబుతున్న లెక్కలు తాజా అధికారిక లెక్కలన్నారు. 2023 ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లాలో పెట్టిన ఐఆర్ మీటర్లలో 83.16 శాతం పని చేస్తున్నాయని, వీటి ద్వారా మాత్రమే లైవ్ రీడింగ్ తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాదిన్నరలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. పైలట్ ప్రాజెక్టు క్రింద శ్రీకాకుళం జిల్లాలో పెట్టిన మొత్తం 29 వేల కనెక్షన్లలో కేవలం 6.6 శాతం మాత్రమే ఆగిపోయిన, కాలిపోయిన మీటర్లు ఉన్నాయని చెప్పారు. పీఈజీ డేటా సరిగా లేదని ప్రభుత్వ అఫీషియల్ డేటాతో లెక్కించి చూస్తే రెండున్నర సంవత్సరాలలో పేబ్యాక్ పీరియడ్ వస్తుందన్నారు. సగటు విద్యుత్ కొనుగోలు ధరను ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఒక యూనిట్‌కి రూ.4.20 పైసలుగా తీసుకుని లెక్కించడం వల్లే గణాంకాలు సరిగా లేవన్నారు. వాస్తవానికి సగటు సరఫరా ఖర్చు ఒక యూనిట్‌కి రూ.6.98 పైసలు పేర్కొన్నారు. ఈ రూ.6.98 పైసలను రెగ్యులేటరీనే నిర్ణయించింది తప్ప తాము కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా సగటు సరఫరా ఖర్చును ఆధారంగా చేసుకునే డిస్కంలకు సబ్సిడీ ఇస్తుందన్నారు. డీటీఆర్‌కు మీటర్ పెట్టడం వల్ల అన్నింటికి సంబంధించి విద్యుత్ ఖర్చు తెలుస్తుంది.. తప్ప రైతు ఎంత విద్యుత్ ఖర్చు చేశాడు అనేది తెలియదన్నారు. ఫీడర్‌కు లింకుగా 120 నుంచి 200 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయని వీటికి రెండేసి కనెక్షన్లు ఉంటాయన్నారు.

ప్రయోజనాలు ఇవే...

డీటీఆర్, ఫీడర్, డివిజన్, డిస్కం స్థాయిల్లో ఏ మీటర్ ద్వారా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవచ్చన్నారు. రైతుకు తను ఎంత మేర విద్యుత్ వినియోగం చేశారనేది తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎంత సబ్సిడీ అందుతుందో తెలుసుకోవచ్చన్నారు. ఏ మీటర్ ఎందుకు పనిచేయడం లేదో తక్షణమే తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. దీన్ని ఏ విధంగా నియంత్రించాలనేది ట్రాన్స్ కో స్థాయిలో, స్టేట్ లో డిస్టార్ట్ సెంటర్ స్థాయిలో ఎప్పటికప్పుడు విద్యుత్ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చనని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. స్మార్ట్ మీటర్ల వినియోగం వల్ల అందుబాటులో ఉన్న విద్యుత్ ఎంతుందో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా మార్కెట్ లో మనం విద్యుత్ ను అమ్మాలన్నా, కొనాలన్నా మార్గం సులువవుతుందన్నారు. అదే విధంగా స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి 15 నిమిషాలకోసారి డేటా వస్తుందని, మనం ఎక్కడి నుండైనా మీటర్ ను ఆఫ్, ఆన్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మీటర్లు ఎంత విద్యుత్ ను వినియోగిస్తున్నాయి? ఏ రకమైన లోడ్ తీసుకుంటున్నాయి? ఎప్పటికప్పుడు చూసుకొని ట్రాన్స్ కో గానీ, స్టేట్ లో డిస్టార్ట్ సెంటర్ గానీ విద్యుత్ కొనుగోలును బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నారు. విద్యుత్ ను ఆదా చేసుకునేందుకు ఇదొక అవకాశంగా భావించాలన్నారు.

ప్రభుత్వమే భరిస్తుంది...

రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడమనేది ఒక విప్లవాత్మక సంస్కరణ అన్నారు విజయానంద్. అలైడ్ మెటీరియల్ ఆర్థికంగా భారమైనా దాదాపు రూ.4వేల కోట్లను వెచ్చించి మీటర్లతో ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రకరకాల టెక్నాలజీలు, పద్ధతులు వాడటం ద్వారానే సంస్కరణలు వస్తాయని, వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి నిర్ధేశించిన లక్ష్యంలో భాగంగా 2025 లోగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కార్యక్రమం పూర్తవుతుందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి ఏడాది లోగా అన్ని కనెక్షన్లు ఇస్తామన్నారు. మొత్తం 18 లక్షల మీటర్లు బిగించడం జరుగుతుందన్నారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అన్నారు. స్మార్ట్ మీటర్ల గురించి రైతులకు ఎలాంటి అనుమానాలూ లేవని..రైతుల నుంచి ఆమోద పత్రాలను తీసుకున్నామన్నారు. 16 లక్షల 55 వేల 988 మంది రైతులు స్మార్ట్ మీటర్లకు మద్దతు తెలిపారని..స్మార్ట్ మీటర్ల బిగింపునకు ప్రభుత్వమే వ్యయం భరిస్తుందన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం