Munugodu Bypoll Results: విజయం దిశగా టీఆర్ఎస్..! పెరుగుతున్న మెజార్టీ
Munugodu Bypoll Results Updates: మునుగోడులో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 13 రౌండ్లు ముగియగా.. కారు పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 9 వేల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది.
Munugodu Election Results 2022: మునుగోడు బైపోల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ ఆధిక్యతను కనబరుస్తోంది. స్పష్టమైన ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. మొదటి రౌండ్లోనే ఆధిక్యం ప్రదర్శించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత రెండు రౌండ్లలో బీజేపీ లీడ్ లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన రౌండ్లలో టీఆర్ఎస్... నెమ్మెదిగా ముందుకువచ్చేసింది. ఇప్పటివరకు 13 రౌండ్లు ముగియాగ... టీఆర్ఎస్ 9 వేల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 14 రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
చౌటుప్పల్ పై భారీగా ఆశలు పెట్టుకుంది బీజేపీ. అయితే ఇక్కడ ఆశించిన మెజార్టీ రాకపోవడం... ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా చెప్పారు. అనుకున్నంత మెజార్టీ ఇక్కడ రాలేదన్నారు. అయినప్పటికీ... విజయంపై ధీమాగా ఉన్నానని అన్నారు. మరోవైపు చండూరుపై కూడా బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఈ పరిణామం... రాజగోపాల్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల ఓట్లను లెక్కించారు. ఆయా మండలాల్లో టీఆర్ఎస్ కు మెజార్టీ ఓట్లు వచ్చాయి.
ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉదయమే పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులకు 88 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు కేవలం 4 ఓట్ల ఆధిక్యం లభించింది.
నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఐదు, ఆరు రౌండ్ల ఫలితాల్లో కాస్త ఆలస్యం అయింది. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.