TRS On Munugode : టీఆర్ఎస్ అనుకుందే అయిందా?
Munugode ByPoll Result : మునుగోడు ఉపఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు. ఏ వైపు నుంచి ఒక్క ఓటు కూడా పోకుండా ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగానే.. తమ గుర్తును పోలిన గుర్తులపై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ చుట్టూ తిరిగింది.
ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ పార్టీ(TRS Party) అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ గుర్తును పోలిన గుర్తులతో నష్టం ఉందని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం(Election Commission) దృష్టికి కూడా తీసుకెళ్లింది. గతంలో ఇలానే తమకు నష్టం జరిగిందని వివరించింది. అయితే తాజాగా మునుగోడు ఫలితాల్లో ఇది కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ భయపడిన.. గుర్తులకు ఓట్లు పడుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి.. టీఆర్ఎస్ పార్టీ భయపడిన రెండు గుర్తులకు 800కు పైగా ఓట్లు వచ్చాయి. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు వరకు కారు గుర్తును పోలిన రోటీ మేకర్ గుర్తకు మొత్తం 483 ఓట్లు వచ్చాయి. రోడ్ రోలర్(Road Roller) గుర్తుకు 335 ఓట్లు వచ్చాయి. ఇక మిగిలిన రౌండ్లలోనూ ఇలాంటి ప్రభావం ఉంటుందని టీఆర్ఎస్ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll)పై కారును పోలిన 8 గుర్తులుపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నిక గుర్తుల జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడలాంటి గుర్తులపై టీఆర్ఎస్ ఆరోపించింది. ఆ గుర్తులను తొలగించాలని ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు.
2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే.. స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలిన గుర్తులు ఉన్న కారణంగా ఓట్లు పడ్డాయని వివరించారు.
మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు కూడా తాజాగా ఓట్లు ఆ గుర్తులకు వస్తుండటంతో టీఆర్ఎస్ భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.