Minister Harish rao: ‘మళ్లీ మేమే వస్తాం’... 40 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరన్న మంత్రి హరీశ్-minister harish rao counter to congress leaders
Telugu News  /  Telangana  /  Minister Harish Rao Counter To Congress Leaders
మంత్రి హరీశ్ రావ్
మంత్రి హరీశ్ రావ్

Minister Harish rao: ‘మళ్లీ మేమే వస్తాం’... 40 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరన్న మంత్రి హరీశ్

26 May 2023, 16:06 ISTMaheshwaram Mahendra Chary
26 May 2023, 16:06 IST

Minister Harish rao Latest News: ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు మంత్రి హరీశ్ రావ్. మూడోసారి బీఆర్ఎస్ గెలవటం ఖాయమన్న ఆయన… ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

BRS Aathmeeya Sammelanam at Miryalaguda: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లలోనూ బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతుందన్నారు మంత్రి హరీశ్ రావ్. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ఆయన.... ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఓనాడు నల్గొండ జిల్లా అభివృద్ధికి దూరంగా ఉంటే... ఇవాళ కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఆస్పత్రులు మంజూరు అయ్యాయని... జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు.

నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు....ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావ్. ఈ మధ్య కాలంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని... వచ్చే ఎన్నికల్లో 12 సీట్లలోనూ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగం లేదని.. కాంగ్రెస్‌ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందన్న ఆయన... కాంగ్రెస్‌ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని దుయ్యబట్టారు.

"నాడు కాంగ్రెస్ హయాంలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయలేకపోయారు. కానీ ఇవాళ మేం ఏర్పాటు చేశాం. నకిరేకల్ నియోజకవర్గంలో నిమ్మ మార్కెట్ కూడా ఏర్పాటు చేశాం. అన్ని నియోజకవర్గాల్లో ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఎవరెన్ని చెప్పినా గెలిచేది మేమే. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు. పగటి కలలు కంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ దూరదృష్టితో అన్ని పనులను చేస్తున్నారని.. అలాంటి సర్కార్ ను మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది" అని మంత్రి హరీశ్ రావ్ వ్యాఖ్యానించారు.

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ వచ్చాయని చెప్పారు మంత్రి హరీశ్. ఐటీ రంగంలో దేశంలోనే టాప్ లో ఉన్నామని చెప్పారు. ఏం చేయకుండానే అవార్డులు వస్తున్నాయా..? నాడు కాంగ్రెస్ హయాంలో ఈ అవార్డులన్నీ ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు.