KTR on Congress: బిఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్న కేటీఆర్
KTR on Congress: గత ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న పథకాల పేర్లను కాంగ్రెస్ కాపీ కొట్టిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
KTR on Congress: కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పథకాలపేర్లను మార్చి ఆరు గ్యారంటీలంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్దేనని, తెలంగాణపై స్పష్టమైన అవగాహన లేనీది కాంగ్రెస్ పార్టీకేనని కేటీఆర్ మండిపడ్డారు.
ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని ప్రధాన హామీలను వివరించారు.అన్నీ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఈ మేనిఫెస్టోను కెసిఆర్ రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా కవరేజీని అందించే “కేసీఆర్ బీమా” అనే పథకాన్ని కేటీఆర్ హైలైట్ చేశారు.
తెలంగాణలో సుమారు 95 లక్షల కుటుంబాలు “ కేసీఆర్ బీమా ” ద్వారా లబ్ధి పొందనున్నాయని ఆయన వివరించారు.ఇది రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యాన్ని అందించే " తెలంగాణ అన్నపూర్ణ " పథకాన్ని ఆయన కొనియాడారు.
విజన్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ : కేటీఆర్
రాష్ట్రంలోని మహిళలకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టిన “ సౌభాగ్య లక్ష్మి ” పథకానికి కూడా కేటీఆర్ మద్దతు ఇచ్చారు.తెలంగాణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలో భాగంగానే ఈ పథకాలని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు,పేద కుటుంబాలు స్వతంత్రంగా జీవించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని మంత్రి విమర్శించారు. ఉచిత విద్యుత్, చౌక బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీలు గుప్పించిందని కానీ ఆ హామీలను తర్వాత అమలు చేయలేదన్నారు. సామాజిక సంక్షేమానికి బిఆర్ఎస్ కట్టుబడి ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు .
కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీఆర్ఎస్ పాలనలో దాదాపు 44 లక్షల మంది ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్దేనని, రాష్ట్రంపై స్పష్టమైన విజన్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కేటీఆర్ ప్రశ్నించారు.
ముచ్చటగా మూడోసారి కెసిఆరే ముఖ్యమంత్రి
బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీకి గాని కెసిఆర్ కు గాని లేదని, రాజకీయ పొత్తుల కంటే కూడా మొదలు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి జరగాలనే బిఆర్ఎస్ పార్టీ మరియు కేసీఆర్ విశ్వసిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ దేశంలో ఏ ఇతర రాష్ట్రం కేటాయించడం లేదన్నారు.
2014 నుండి మైనారిటీ సంక్షేమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తన పెట్టుబడిని పది రెట్లు పెంచిందని ఆయన పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ విజయం దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే అయిదేళ్ల పాటు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆరే రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.
రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్