TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో మరో కోణం.. కొత్తగా తెరపైకి ‘డీఈ’, కూపీలాగుతున్న 'సిట్'
TSPSC Paper Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ రమేశ్ చిక్కారు. ఇదీ కాస్త హాట్ టాపిక్ గా మారింది.
TSPSC Paper Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా విద్యుత్ శాఖకు చెందిన డీఈ వ్యవహరం తెరపైకి వచ్చింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీక్లో వరంగల్ జిల్లాలో పని చేస్తున్న ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజినీర్ (డీఈ) రమేశ్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. కోర్డులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
20 మందికి కొనుగోలు…!
తాజాగా అరెస్ట్ చేయబడిన డీఈ రమేశ్... 20 మందికి పైగా పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురిని గుర్తించిన సిట్.... ప్రశ్నిస్తోంది. లోతుగా విచారించి కూపీ లాగే పనిలో పడింది. వీరిలోని కొందర్ని ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం 46 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా డీఈ వ్యవహరం తెరపైకి రావటంతో... అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే విద్యుత్ శాఖలో డీఈ ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా కూడా రమేశ్ పనిచేసేవారని సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. అక్కడి అభ్యర్థుల పరిచయాలతో లీకేజీ దందా నడిపినట్లు తేలింది.
మరోవైపు సిట్ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. అడ్డదారుల్లో పేపర్ సంపాదించిన అభ్యర్థులు... పరీక్షలు రాసి టాపర్లుగా నిలిచిన విషయం విచారణలో తెలిసింది. ఏఈ పరీక్షలో టాపర్ గా నిలిచిన అభ్యర్థి చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోవడం వెలుగుచూసింది. ఏఈలో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థి (A+B) స్క్వేర్ అంటే కూడా చెప్పలేక దిక్కులు చూశాడని సిట్ అధికారులు అంటున్నారు. కనీస పరిజ్ఞానం లేకపోయినా పోటీ పరీక్షల్లో నెగ్గారన్నారు. వీరంతా అడ్డదారిలో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి టాపర్లుగా నిలిచారని సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో టాపర్ల అసలు రహస్యం వెలుగుచూసింది. గ్రూప్ 1, ఏఈ, ఏఈఈ, డీఏవో పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారిని సిట్ పోలీసులు విచారణ చేశారు. వారి నుంచి వచ్చే జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాశారని గుర్తిస్తున్నారు. పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన అభ్యర్థులు చిన్న ప్రశ్నలకే తెల్లమొహం వేశారంటూ సిట్ పోలీసులు అంటున్నారు.