Cold Wave Alert: వణికిస్తున్న చలి.. రాబోయే 4 రోజులు జాగ్రత్త!
low temperatures in telangana: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
Cold Wave Increased in Telangana: వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరగటం మొదలైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 5 దాటితే చాలు .. చలి వణికిస్తోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇవాళ్టి నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత మరితం పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాబోయే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఇవాళ చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. గురువారం ఉదయం రాజేంద్రనగర్ లో 10.5 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో రికార్డు స్థాయిలో 9.1 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో మరింతగా...
ఇక హైదరాబాద్ లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు... 2 నుంచి 4 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం నగరంలో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Cold Wave in andhrapradesh: మరోవైపులోనూ ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మన్యంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల నుంచి 8.2 డిగ్రీలకు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 12 డిగ్రీల నుంచి 9 డిగ్రీలకు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12.7 డిగ్రీల నుంచి 9.7 డిగ్రీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వెచ్చని దుస్తులు ధరించాలని సూచించింది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో.. ఉదయం పూట ప్రయాణికులు కూడా రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.