Prashanth Neel: తెలుగు మూలాలు మరవని కేజీఎఫ్ డైరెక్టర్.. హాస్పిటల్కు భారీ విరాళం
Prashanth Neel: కేజీఎఫ్ మూవీతో ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తెలుగు మూలాలను మరచిపోలేదు. ఏపీలో నిర్మించబోతున్న ఓ హాస్పిటల్కు భారీ విరాళం ఇచ్చాడు.
ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఈ డైరెక్టర్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 మూవీలతో బాక్సాఫీస్ రికార్డులనే తిరగరాసిన ఈ డైరెక్టర్.. ప్రభాస్తో సలార్ మూవీ చేస్తున్నాడు. పేరుకే కన్నడ డైరెక్టర్ అయినా.. ప్రశాంత్ మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అతడు మరెవరో కాదు.. ఏపీ పీసీసీ మాజీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి తనయుడే.
తన తెలుగు మూలాలను మరచిపోని ప్రశాంత్ నీల్.. సోమవారం (ఆగస్ట్ 15) తన తండ్రి సుభాష్ జయంతి సందర్భంగా సత్యసాయి జిల్లాలోని ఆయన సొంతూరు నీలకంఠపురం వచ్చాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ను సందర్శించాడు. దీనిని రఘువీరారెడ్డియే స్వయంగా చూపించారు. హాస్పిటల్ ఎలా ఉండబోతోందో ప్రశాంత్కు వివరించారు.
ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రశాంత్ రూ.50 లక్షల విరాళం ప్రకటించడం విశేషం. ప్రశాంత్ నిర్మాణంలో ఉన్న ఈ హాస్పిటల్ను పరిశీలిస్తున్న వీడియోను రఘువీరా తన ట్విటర్లో షేర్ చేశారు. "సుభాష్ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు ప్రశాంత్ నీల్ నీలకంఠపురంలో నిర్మించబోతున్న ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్కు రూ.50 లక్షలు ప్రకటించారని చెప్పడానికి సంతోషంగా, గర్వంగా ఉంది" అంటూ రఘువీరా ట్వీట్ చేశారు.
తన సొంతూరు నీలకంఠపురం ఊరిని సందర్శించిన సందర్బంగా ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను చనిపోయిన తర్వాత ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కూడా చెప్పడం గమనార్హం. అసలు నీలకంఠపురం ఊరి పేరు మీదుగానే ప్రశాంత్ తన పేరు చివరన నీల్ అని పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్తో సలార్ మూవీ చేస్తున్న ప్రశాంత్.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో మరో మూవీ తీయబోతున్నాడు.