Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో ట్విస్ట్... ప్రైవేటీకరణ ఆపలేదని ప్రకటన
Vizag Steel Plant Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ ఆపలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Centre On Vizag Steel Plant Privatisation: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై తెగ చర్చ నడుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని, సంస్థను బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే అంతలోనే కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదంటూ ఉక్కు శాక స్పష్టం చేసింది.
సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని కేంద్ర ఉక్కు శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని వివరించింది. ఆర్ఐఎన్ఎల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోలేదని చెప్పుకొచ్చింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
నిన్న కేంద్రమంత్రి ప్రకటన…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ గురువారం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం వచ్చిన కేంద్ర మంత్రి ప్రస్తుతానికి ప్లాంటును ప్రైవేటీకరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరింత సమయం వేచి ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్త యూనిట్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని, కొత్త యూనిట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణకు ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి వివరించారు. స్టీల్ ప్లాంటుకు ప్రధాన సమస్యగా ఉన్న మైనింగ్, ఐరన్ ఓర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫగ్గన్ తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి కొట్టి పారేశారు. సింగరేణి ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక కోసం పర్యటిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెట్టే విషయంలో బిఆర్ఎస్ పార్టీది రాజకీయ ఎత్తుగడ మాత్రమే అన్నారు.
కేంద్రమంత్రి ప్రకటన నేపథ్యంలో… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా తమవైఖరిని మరోసారి స్పష్టం చేసే ప్రయత్నం చేశాయి. ఇంతలోనే కేంద్ర ఉక్కుశాఖ ప్రైవేటీకరణ ఆపలేదని ప్రకటన చేయటం హాట్ టాపిక్ గా మారింది.
సంబంధిత కథనం