ISRO : అక్టోబర్ 22న నింగిలోకి 36 ఉపగ్రహాలు
ISRO To Launch 36 Satellites : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అక్టోబర్ 22న భారీ ప్రయోగానికి సిద్ధమైంది. మెుత్తం 5,400 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించాలని భావిస్తోంది. భారత నేల నుండి అంతరిక్షంలోకి ప్రయోగించే అత్యంత భారీ పేలోడ్ ఇదే.
LVM3 (లాంచ్ వెహికల్ మార్క్ 3) ద్వారా ఉపగ్రహాలు(Satellites) ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. గతంలో GSLV మార్క్ III ద్వారా ప్రయోగాలు చేసింది. అయితే తాజాగా భారీ ఉపగ్రహాలను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీహరికోట రేంజ్ (షార్)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అక్టోబర్ 22 ప్రయోగిస్తుంది.
ప్రస్తుతం పూర్తి వాణిజ్య అవసరాల కోసం దీన్ని రూపొందించారు. ఎన్ఎస్ఐఎల్తో ఒప్పందం తర్వాత జరుగుతున్న తొలి బరువైన రాకెట్ ప్రయోగం ఇదే. సుమారు 36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్లు భారీగా వాణిజ్య లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కటి 150 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
LVM3 గ్లోబల్ కమర్షియల్ లాంచ్ సర్వీస్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నందున ఈ ఒప్పందం NSIL, ఇస్రోకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలువనుంది. GSLV మార్క్ 3 ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలో ఏర్పాట్లు నడుస్తున్నాయి. గతంలోనే ఈ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇరువైపులా ఉండే, రెండు ఘన ఇంధన బూస్టర్ల నిర్మాణం ఇప్పటికే అయిపోయింది. క్రయోజనిక్ ఇంజన్ను అమర్చాల్సి ఉంది.
ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేని కారణంగా అతి పెద్ద షిప్ లలో భూకేంద్రాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. అక్టోబర్ 22 న ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈలోపు.. మహేంద్రగిరి నుంచి క్రయో ఇంజన్ ను తీసుకొచ్చి ఉపగ్రహాన్ని పూర్తిగా అమర్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 ఉపగ్రహాలను రాకెట్ శీర్షభాగంలో ఉంచి ప్రయోగం చేసేందుకు సిద్ధం చేస్తారు. అంతరిక్షంలో లో ఎర్త్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహాల సమూహాన్ని ప్రవేశపెడతారు. ఇప్పటికే ఇస్రో అధికారులు సీరియస్ గా వర్క్ చేస్తున్నారు.
సంబంధిత కథనం