10Th Exams : పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లతోనే
10th class exams 6 papers : తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఇక నుంచి ఆరు పేపర్లతోనే జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి పరీక్షలు(Tenth Exams) ఆరు పేపర్లతోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలకు, ఇతర అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. తొమ్మిది, పదో తరగతికి ఎస్ఏటూ పరీక్షలు కూడా ఆరు పేపర్ల(6 Papers)తోనే జరపాలని నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతిలో పదకొండు పేపర్లతో పరీక్షలు జరిగేవి.
పదకొండు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని ఆరు పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి, ఎస్సీఈఆర్టీ ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనకు విద్యాశాఖ(Educational Department) ఆమోదం తెలిపింది. అయితే సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారులకు సర్క్యూలర్ జారీ అయింది.
గత రెండు విద్యా సంవత్సరాల్లో కొవిడ్-19(Covid 19) మహమ్మారి కారణంగా ప్రభుత్వం SSC పబ్లిక్ పరీక్షలలో పేపర్ల సంఖ్యను ఆరుకు తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సరంలో పేపర్లు తగ్గించినా.. మహమ్మారి కారణంగా అన్ని పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలకు నమోదు చేసుకున్న విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారి అంతర్గత మూల్యాంకన మార్కులను పరిగణనలోకి తీసుకుని వారికి గ్రేడ్లు కేటాయించారు.
2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు(10th Exams) ఆరు పేపర్లకు నిర్వహించారు. ఫలితాలు కూడా ప్రకటించారు. ఇప్పుడు అదే ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. 'ప్రభుత్వం SSC పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఈ విద్యాసంవత్సరానికి పేపర్ల సంఖ్యను ఆరుకు తగ్గించింది. పరీక్షలకు 100 శాతం సిలబస్ కవర్ చేస్తారు.' అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
సాధారణంగా 11 పేపర్లతో పది పరీక్షలు(Tenth Exams) జరిగేవి. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు(Exams) ఉంటాయి. కరోనా వచ్చినప్పుటి నుంచి ఈ పరిస్థితి మారింది. ఆరు పేపర్ల విధానం చేశారు. 11 రోజులు పరీక్షలతో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని, ఆరు పేపర్లు అయితే బాగుంటుందని ఈ విధానాన్ని తీసుకొచ్చారు.