Cricket Stadium in Hyd: గుడ్ న్యూస్.. నగరంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం
హైదరాబాద్ లో మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు అడుగులు పడబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
New Inter national Cricket Stadium in Hyderabad: క్రికెట్ ను మరింత విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష చేపట్టారు. 33 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయటంపై క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీతో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ కమిటీల ఏర్పాటుపై చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బలోపేతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. హెచ్సీఏ విస్తరణకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మాదిరిగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో క్రికెట్ మరింత విస్తరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్లబ్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అనుసంధానం చేసేలా చూడాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్డేడియం (ఉప్పల్) ఉంది. అంతర్జాతీయ మ్యాచ్ లకు ఇదే ఆతిథ్యం ఇస్తోంది. 16 ఎకరాలకు విస్తరించిన ఈ స్టేడియంలో 50 వేలకు మంది కూర్చొనే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. టికెట్లు దొరకటం లేదు. తాజాగా ఓ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట కూడా జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. హెచ్ సీఐ పని తీరుపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో మరో ఆధునాత స్టేడియం నిర్మించటంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.