TS Weather Alert: మరో 4 రోజులు వర్షాలే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు!
Weather Updates Telugu States: తెలంగాణలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం కురుసిన వర్షాలతో తీవ్రస్థాయిలో పంట నష్టం వాటిల్లింది. అయితే మరో 4 రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rain Alert to Telangana : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కురిసిన భారీ వర్షం దాటికి భారీస్థాయిలో పంట నష్టం వాటిల్లింది. ఇక హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు జలమయం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అలర్ట్ ఇచ్చింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
హెచ్చరికలు జారీ…
ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 -40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అకాల వర్షం కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. రాంచంద్రాపురం-7.98, గచ్చిబౌలి-7.75, గాజులరామారం-6.5, కుత్బుల్లాపూర్-5.55, జీడిమెట్లలో 5.33 సెం.మీ వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, కేపీహెచ్బీ పరిధిలోనూ దాదాపు అదే మోతాదులో వర్షం కురిసింది. నడి వేసవిలో ఇంత భారీ వర్షం పడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. 2015లో ఏప్రిల్ 12న అత్యధికంగా 6.1 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డు నమోదైంది. వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచిన గాలులు నగరవాసులను వణికించాయి. అకాల వర్షంతో పాటు గాలుల వేగానికి హైదరాబాద్లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు., హోర్డింగులు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇక అకాల వర్షాల దాటికి తెలంగాణ వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. వరికోతకు సిద్ధంగా ఉన్న పంటలు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల మార్కెట్లలో ఉన్న ధాన్యం కూడా తడిసిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే తడిసిపోవటంతో రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
సంబంధిత కథనం