TS Weather Alert : తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. ఆపై మళ్లీ ఎండలు షురూ..!
Weather Updates Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే మరో 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
Rain Alert to Telangana : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఇక అకాల వర్షాల దాటికి లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత వాతవరణం పొడిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు హెచ్చరికలను కూడా జారీ చేసింది.
ఆ తర్వాతే పొడి వాతావరణం..!
మే 7 వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆదివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడుతాయని వెల్లడించింది. తిరిగి పొడి వాతావరణం ఏర్పడుతుందని.... మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక అకాల వర్షాల దాటికి తెలంగాణ వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. వరికోతకు సిద్ధంగా ఉన్న పంటలు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల మార్కెట్లలో ఉన్న ధాన్యం కూడా తడిసిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే తడిసిపోవటంతో రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు పంట నష్టం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీకి వర్ష సూచన…
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు.