AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు!
Weather Updates Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
Rain Alert to AP and Telangana: ఆంధ్రప్రదేశ్ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఉష్షోగ్రతలు తగ్గముఖం పట్టడమే కాదు… వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల దాటికి పంట నష్టం వాటిల్లింది.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని... పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఐఎండి అంచనా ప్రకారం, వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక సోమవరాం (రేపు) అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా చెట్ల కింద ఉండొద్దని సూచించింది.
ఇక ఇవాళ భీమవరంలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షానికి వరిపంట దెబ్బతింది.
తెలంగాణలో వర్షాలు.. హెచ్చరికలు జారీ
Rain Alert to Telangana : తెలంగాణలో కూడా గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 26 తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని..ఈ జిల్లాల్లో వడగండ్లు పడుతాయని హెచ్చరించిది. ఈ జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. ఇక వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏప్రిల్ 27వ తేదీ వరకు వర్షాలు పడుతాయని పేర్కొంది.
అకాల వర్షాల దాటికి పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.