Palvai Sravanthi : మా ఓటు బ్యాంక్ బీజేపీ వైపు టర్న్ అయ్యింది
Palvai Sravanthi On Munugode Result : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. తాజాగా ఫలితాలపై స్పందించారు.
Munugode Bypoll Result : మునుగోడులో బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) పార్టీలు ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని కాంగ్రెస్ పార్టీ(congress Party) మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి విమర్శించారు. ఓటర్లను ప్రలోభాలకు, భయాందోళనకు గురిచేయడం ఆవేదన కలిగించిందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy venkat reddy) కోవర్ట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయన్నారు. తమ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు టర్న్ అయ్యిందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
'వెంకట్ రెడ్డి సంగతి హై కమాండ్ చూసుకుంటుంది. ఆయనపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఇంత అనైతిక రాజకీయాలను నేనెప్పుడూ చూడలేదు. బీజేపీ, టీఆరెఎస్ పార్టీలు కలిపి 500 కోట్లు ఖర్చు చేశాయి. మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll) పరిణామాలు చూశాక రాజకీయాలు చేయాలంటేనే భయమేస్తుంది. మునుగోడులో బీజేపీ కోవర్టు రాజకీయాలు చేసింది. ఈ ఎన్నికలో మద్యం ఏరులై పారింది. ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా(Social Media)లో పోస్టు చేయడం అనైతికం.' అని పాల్వాయి స్రవంతి అన్నారు.
మునుగోడును టీఆర్ఎస్(TRS) ప్రలోభాలతో గెలుచుకొందని పాల్వాయి స్రవంతి విమర్శించారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు చేశాయని అన్నారు. ప్రజల కోసం జరిగిన ఎన్నికైతే ఇది కాదు అని స్రవంతి వ్యాఖ్యానించారు. మా మధ్య ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే వారిపై విచారణ జరుగుతుందన్నారు.
'పగలు, రాత్రి తేడా లేకుండా ముమ్మరంగా కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా మునుగోడు నియోజకవర్గం మొత్తం దాదాపు ప్రచారం చేశాను. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ఓట్లను అడిగాను. ఒక ఆడబిడ్డనైనా ప్రతి వాడవాడకు తిరిగి ప్రచారం చేశా. నేను ప్రజాబలంతో పోటీ చేస్తే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ధనం, అధికారంతో ప్రచారం సాగించారు.' అని పాల్వాయి స్రవంతి అన్నారు.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. నల్గొండ జిల్లాలో కీలక నేతలున్న కాంగ్రెస్ పార్టీ.. మునుగోడును లైట్ గా తీసుకున్నట్టుగా ఉంది. సరైన పోల్ మేనేజ్ మెంట్ కూడా లేక.. డిపాజిట్ కూడా రాలేదు. మునుగోడు(Munugode)లో మూడో స్థానానికి పరిమితం చేశారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి 10.6 శాతం ఓట్లు వచ్చాయి. కిందటి ఎన్నికల్లో 48.9 శాతం ఓట్లు పొందింది. 23,906 ఓట్లతో మూడో స్థానంలో ఉంది.